
సుల్తాన్పూర్: భారత్లో బ్లాక్, వైట్ ఫంగస్ కేసులు వస్తాయని మూడేళ్ల కిందటే తాను చెప్పానని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని తాను ముందే హెచ్చరించానని తెలిపారు. నాల్రోజుల ఉత్తర్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా సుల్తాన్పూర్కు చేరుకున్న మేనకా.. అక్కడి జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో కరోనా కట్టడిపై తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోకి బ్లాక్, వైట్ ఫంగస్ కేసులు వస్తాయని మూడేళ్ల కిందటే చెప్పామన్నారు. గతంలో పోలియో వ్యాప్తి చెందుతున్న సమయంలోనూ చాలా గ్రామాల్లోని ప్రజలు టీకా తీసుకునేందుకు వెనుకాడారని గుర్తు చేశారు. దీంతో నాలుగేళ్లలో పోలియో మరింతగా విస్తరించిందన్నారు. కరోనా విషయంలోనూ ఇటువంటి పరిస్థితులే నెలకొన్నాయని.. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకొని, టీకా తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.