భోగాపురం ఎయిర్ పోర్ట్ కి శంకుస్థాపన.. సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన : సీఎం జగన్ 

భోగాపురం ఎయిర్ పోర్ట్ కి శంకుస్థాపన.. సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన :  సీఎం జగన్ 
  • జూన్ లో ఉద్దానం  కిడ్నీ రిసర్చ్ సెంటర్ ప్రారంభం
  • రూ.700 కోట్ల మంచి నీటి సరఫరా పథకం.. జాతికి అంకితం
  • ఐటీ హబ్ గా ఉత్తరాంధ్ర
  • 30 నెలల్లో ఎయిర్ పోర్ట్ నిర్మాణం
  • పరిపాలన వికేంద్రీకరణే ధ్యేయం
  • చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై విమర్శలు

విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరపల్లి వద్ద నిర్మించతలపెట్టిన భోగాపురం ఎయిర్ పోర్ట్ కి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు..

రూ.4952 కోట్లతో పనులు..

భోగాపురం ఎయిర్ పోర్ట్ ని రూ.4952 కోట్లతో నిర్మించబోతున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ పనులను జీఎంఆర్ విశాఖ ఇంటర్నేషనల్ చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ ఎయిర్ పోర్ట్ ని 4 కోట్ల జనాభాకు సరిపోయేలా డిజైన్ చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా 7 ఎయిరో బ్రిడ్జిలు, కార్గో టెర్మినల్, ఎం ఆర్ వో సెంటర్ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఎ 320, ఎ 380 డబుల్ డెక్కర్ ఫ్లైట్స్ ల్యాండయ్యేలా రన్ వే ఉండబోతోందన్నారు. 2,203 ఎకరాల్లో విమానాశ్రయం, 3.8 కి.మీ.ల రన్ వే, 500 ఎకరాల్లో ఎయిరో సిటీ ని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. విశాఖ నుంచి భోగాపురానికి రూ.6,300 కోట్లతో 6 లేన్ల రహదారిని నాలుగు నెలల్లో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుతో వేల సంఖ్యంలో ఉద్యోగ కల్పన జరగనుందన్నారు. 2026 నాటికిఈ ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. దీని నిర్మాణానికి సపోర్ట్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు, భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు.

పునరావాసాలు కల్పించాం..

పోర్టు నిర్మాణంలో భాగంగా భూములు ఇచ్చిన 4 గ్రామాల ప్రజలకు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లు కట్టించి పునరావాసం కల్పించారని సీఎం జగన్ తెలిపారు.  విశాఖ పట్టణంలో త్వరలో అదానీ డేటా సెంటర్ కి శంకుస్థాపన చేయబోతున్నట్లు సీఎం జగన్ చెప్పారు. తద్వారా  ఐటీ రంగం వృద్ధి సాధించనున్నట్లు పేర్కొన్నారు. 

కిడ్నీ రిసర్చ్ సెంటర్ పూర్తి..

ఏళ్లుగా ప్రభుత్వాలు మారుతున్నా.. ఉద్దానం కిడ్నీ బాధితుల ఆవేదన ఎవరికీ పట్టలేదని సీఎం జగన్ విమర్శించారు. తమ ప్రభుత్వంలో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య శాశ్వత పరిష్కారం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. అందులో భాగంగా నిర్మించిన కిడ్నీ రిసర్చ్ సెంటర్ జూన్లో అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాలకి మంచి నీటి సరఫరా కోసం రూ.700 కోట్లతో పనులు ప్రారంభించినట్లు, దానిని కూడా జూన్ లో ప్రజలకు అంకితం చేయనున్నట్లు స్పష్టం చేశారు. 

విశాఖలోనే కాపురం..

ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విశాఖ కే మకాం మార్చనున్నట్లు, పరిపాలన వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానం అని మరో సారి  స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై జగన్ విరుచుకుపడ్డారు. టీడీపీకి ఎన్నికలంటేనే ప్రజలు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. అప్పులపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రజా సేవకు అంకితమై పని చేస్తున్న తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.