- మైండ్స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దాకా నిర్మాణం
- మూడేండ్లలో పూర్తి చేస్తం: మంత్రి కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టును రూ.6,250 కోట్లతో చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మైండ్స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 31 కిలోమీటర్లు నిర్మిస్తామని, ఇందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వెల్లడించారు. ఈ పనులకు డిసెంబర్ 9న సీఎం శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విట్టర్లో ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న మెట్రో సెకండ్ ఫేజ్ పనులను మూడేండ్లలో పూర్తి చేస్తామని అందులో పేర్కొన్నారు.
బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు 26 కి.మీ.లు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు 5 కి.మీ.ల మెట్రో రైల్ విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని, ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు. నాగోల్ – అమీర్పేట్ – మియాపూర్ మెట్రో కారిడార్ 2017 నవంబర్లో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఎల్బీ నగర్ - అమీర్పేట్ మెట్రో రైల్ మార్గాన్ని 2018 అక్టోబర్లో ప్రారంభించారు. ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ దాకా మెట్రో రైల్ 2020 ఫిబ్రవరిలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు సిటీలోని ఐటీ కారిడార్ను ఎయిర్ పోర్ట్తో కలిపే కీలక మార్గానికి శంకుస్థాపన చేయనున్నారు.