బాసెస్: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి విత్డ్రా అయింది. ఇటీవల దుబాయ్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల మూడు రోజుల పాటు అక్కడే చిక్కుకుపోయిన సింధు ఆ చేదు జ్ఞాపకాల నుంచి కోలుకోవడానికి మంగళవారం మొదలయ్యే స్విస్ ఓపెన్ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఏప్రిల్లో జరిగే బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్తో తను తిరిగి కోర్టులోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
మరోవైపు స్విస్ ఓపెన్లో ఇండియా సవాల్ను హెచ్.ఎస్. ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ ముందుండి నడిపించనున్నారు. శ్రీకాంత్ తొలి రౌండ్లో జేసన్ గుణవాన్తో తలపడనుండగా, ప్రణయ్ జపాన్కు చెందిన కోకి వతనాబేను ఎదుర్కోనున్నాడు. డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–-చిరాగ్ సింగపూర్ ద్వయం వెస్లీ కో– -జున్సుకే కుబోతో అమీతుమీ తేల్చుకోనుంది. విమెన్స్ సింగిల్స్లో ఉన్నతి హుడా, మాళవిక బన్సోద్ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ బరిలోకి దిగుతోంది.
