కరోనాకు 4 కోట్ల డోసులు రెడీ

కరోనాకు 4 కోట్ల డోసులు రెడీ

ఆక్స్​ఫర్డ్​  కరోనా వ్యాక్సిన్​ కొవిషీల్డ్‌ను సిద్ధం చేశామన్న ఐసీఎంఆర్, సీరమ్

మూడో ఫేజ్​ ట్రయల్స్​కు 1600  మందిని ఎంపిక చేసినట్టు వెల్లడి

ఫేజ్​2/3 ట్రయల్స్​లో మంచి ఫలితాలు వచ్చాయన్న ఐసీఎంఆర్​

అమెరికా కంపెనీ నోవావ్యాక్స్​ టీకా ‘కొవోవ్యాక్స్​’ బల్క్​ రెడీ

తొందర్లోనే వయల్స్​లో నింపుతామన్న సీరమ్​ ఇనిస్టిట్యూట్​

థర్డ్​ ఫేజ్​ ట్రయల్స్​కు అప్లై చేస్తామన్న ఐసీఎంఆర్​

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్​ రెడీ అయిపోయింది. 4 కోట్ల డోసులు సిద్ధమయ్యాయి. మిగిలిందల్లా సర్కార్​ నుంచి అనుమతి రావడమే. అవును, ఈ విషయాన్ని సీరమ్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా (ఎస్​ఐఐ), ఇండియన్​ కౌన్సిల్​ ఫర్​ మెడికల్​ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​) వెల్లడించాయి. 4 కోట్ల డోసులను తయారు చేశామని చెప్పాయి. గురువారం వ్యాక్సిన్​ అప్​డేట్​పై ప్రకటన చేశాయి. ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా కలిసి అభివృద్ధి చేస్తున్న టీకాపై సీరమ్​ ఇనిస్టిట్యూట్​ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. మన దగ్గర ‘కొవిషీల్డ్​’ పేరుతో ఈ కరోనా టీకాను మార్కెట్​ చేయనుంది కంపెనీ. ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​తో పాటు అమెరికాకు చెందిన నోవావ్యాక్స్​ కంపెనీతోనూ సీరమ్​ అగ్రిమెంట్​ చేసుకుంది. ఆ కంపెనీ తయారు చేసిన టీకా బల్క్​ కూడా అందిందని, అతి త్వరలోనే దానిని ప్రాసెస్​ చేసి బాటిల్స్​ (చిన్న చిన్న వయల్స్​)లో మందును నింపుతామని సీరమ్​ చెప్పింది. ‘కొవోవ్యాక్స్​’ పేరుతో ఆ​ టీకాను మార్కెట్​ చేస్తోంది. ఆ రెండు టీకాల ట్రయల్స్​, అభివృద్ధికి ఐసీఎంఆర్​ సహకారం అందిస్తోంది.

కొవిషీల్డ్​ ‘లేట్​’ ట్రయల్స్​కు రెడీ

కొవిషీల్డ్​ లేట్​ ఫేజ్​/ఫేజ్​3 క్లినికల్​ ట్రయల్స్​కు వలంటీర్ల ఎంపికను పూర్తి చేశామని ఐసీఎంఆర్​, సీరమ్​ వెల్లడించాయి. ప్రస్తుతం దేశంలోని 15 ప్రాంతాల్లో ఫేజ్​2/3 ట్రయల్స్​ చేస్తున్నామని ఐసీఎంఆర్​ చెప్పింది. అయితే ఫేజ్​3 కోసం అక్టోబర్​ 31న 1,600 మంది వలంటీర్లను ఎంపిక చేసి ఫైనల్​ చేశామని వెల్లడించింది. ప్రస్తుతం చేస్తున్న ట్రయల్స్​లో కొవిషీల్డ్​ మంచి ఫలితాలనిస్తోందని చెప్పింది. కరోనాకు మంచి పరిష్కారం అతి తొందర్లోనే వస్తుందని పేర్కొంది. దేశంలో అడ్వాన్స్​డ్​ దశలో ఉన్న వ్యాక్సిన్​ కొవిషీల్డ్​ మాత్రమేనని చెప్పింది. ముందుగా దేశంలో టీకాను సరఫరా చేసేందుకు 4 కోట్ల డోసులను సీరమ్   తయారు చేసి పెట్టిందని వివరించింది. డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ) ఇచ్చిన రిస్క్​మాన్యుఫాక్చరింగ్​ అండ్​ స్టాక్​పైలింగ్​ లైసెన్స్​ కింద టీకా డోసులను కంపెనీ తయారు చేసిందని తెలిపింది. ప్రస్తుతం బ్రిటన్​, బ్రెజిల్​, సౌతాఫ్రికా, అమెరికాల్లో థర్డ్​ ఫేజ్​ ట్రయల్స్​ నడుస్తున్నాయని, మన దేశంలో తొందర్లోనే మొదలుపెడతామని ఐసీఎంఆర్​ ప్రకటించింది.

త్వరలోనే కొవోవ్యాక్స్​ ట్రయల్స్​ కూడా

కరోనా లాంటి ఆపదలను ఎదుర్కొనేందుకు ప్రైవేట్​ సంస్థలతో కలిసి ప్రభుత్వం పనిచేయడం (పీపీపీ) ఎంతో ముఖ్యమని, అమెరికా కంపెనీ నోవావ్యాక్స్​, బ్రిటన్​ ఆస్ట్రాజెనికాలతో చేసుకున్న ఒప్పందాలు అందుకు ఉదాహరణలని ఐసీఎంఆర్​ చెప్పింది. దేశంలో కొవోవ్యాక్స్​ఫేజ్​3 ట్రయల్స్​కు సంబంధించి త్వరలోనే డీసీజీఐకి దరఖాస్తు చేస్తామంది. అనుమతి వచ్చిన వెంటనే ట్రయల్స్​కు వలంటీర్ల ఎంపికను ప్రారంభిస్తామని పేర్కొంది. ఇప్పటికే కొవోవ్యాక్స్​ బల్క్​ వచ్చేసిందని సీరమ్​ కూడా ప్రకటించింది.

టీకాల్లో ఇండియానే పెద్దన్న: సీరమ్​

కరోనాపై పోరులో ఐసీఎంఆర్​ది చాలా ముఖ్యమైన పాత్ర అని సీరమ్​ సీఈవో అధర్​ పూనావాలా కొనియాడారు. అలాంటి అత్యున్నత సంస్థతో కలిసి పనిచేయడం ద్వారా టీకాల అభివృద్ధిలో దేశాన్ని పెద్దన్న స్థానంలో నిలబెట్టొచ్చని అన్నారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ మౌలిక వసతులను మరింతగా డెవలప్​ చేసేందుకు కరోనా మహమ్మారి రూపంలో ఓ మంచి అవకాశం వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రైవేట్​ భాగస్వామ్యం కూడా చాలా అవసరమని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా టీకాల తయారీలో ఇండియాది కీలక పాత్ర అని ఐసీఎంఆర్​ డైరెక్టర్​ బలరాం భార్గవ అన్నారు. అధునాతన టెక్నాలజీ, మెరుగైన తయారీ యంత్రాలతో ప్రపంచంలోనే టీకాల అభివృద్ధిలో సీరమ్​ ఓ టాప్​ సంస్థ అని నిరూపించుకుందన్నారు. కొవిషీల్డ్​, కొవోవ్యాక్స్​ రెగ్యులేటరీ అప్రూవల్స్​ కోసం రెండు సంస్థల సైంటిస్టులు కృషి చేస్తున్నారని, క్వాలిటీలో ఎక్కడా రాజీ లేకుండా రెగ్యులేటరీ ప్రమాణాలకు తగ్గట్టే టీకాలు తయారవుతున్నాయని చెప్పారు.

For More News..

ఇంజనీరింగ్​లో 28% సీట్లు ఖాళీ

నాపై కేసును కొట్టేయండి