- నకిలీ పాస్బుక్లతో బ్యాంకుకు టోకరా
- ఊట్కూర్ ఎస్బీఐలో రూ. కోట్లలో మోసం
- బ్రోకర్లు, కొందరు బ్యాంకు సిబ్బంది చేతివాటం
- లోన్లు చెల్లించాలంటూ అసలు రైతులకు నోటీసులు
నారాయణ పేట/ఊట్కూర్, వెలుగు: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని ఎస్బీఐ బ్యాంకులో నకిలీ పాస్బుక్లతో పెద్దఎత్తున లోన్లు తీసుకున్నారు. లోన్ చెల్లించాలంటూ రైతులకు నోటీసులు రావడంతో విషయం బయటపడింది. ఊట్కూర్ఎస్బీఐ బ్యాంకులో 2017 నుంచి నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను సృష్టించి ఒక్కో రైతు పేరున రూ.40 వేల నుంచి లక్షన్నర వరకు క్రాప్లోన్లు తీసుకున్నారు. ఇలా ఊట్కూర్ మండలంలోని తిప్రాస్పల్లి, పెద్దపొర్ల, ఊట్కూర్, అమీన్పూర్గ్రామాలతో పాటు మక్తల్మండలం మంతన్గోడ్, ఎర్నాగన్ పల్లి గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది రైతుల పేరు మీద రూ. 2 కోట్లకు పైగా తీసుకున్నారు. లోన్లు కట్టకపోవడంతో బ్యాంకు అధికారులు వారం రోజులుగా ఆయా గ్రామాల్లోని రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అయినా ఎవరూ కట్టకపోవడంతో గ్రామాలకు వెళ్లి లోన్కట్టాలని అడగటంతో తాము అసలు లోన్తీసుకోలేదని రైతులు పేర్కొంటున్నారు.
నకిలీ స్టాంపులు.. ఫోర్జరీ సంతకాలు
మక్తల్పట్టణ కేంద్రంగా రైతుల పేర్లపై నకిలీ పాసు పుస్తకాలను పుట్టించారు. వాటిపై తహసీల్దార్, ఆర్డీఓ సంతకాలను ఫోర్జరీ చేశారు. ఇందులో మంతన్గోడ్గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ముఖ్యపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గతంలో నకిలీ నోట్ల వ్యవహారంలో వీరు పట్టుబడడం గమనార్హం. మంతన్గోడ్గ్రామానికి చెందిన వ్యక్తి దగ్గర తహసీల్దార్, ఆర్డీఓకు సంబంధించిన ముద్రలతోపాటు ఆయా బ్యాంకులకు చెందిన ముద్రలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. వీరితో పాటు మక్తల్ తహసీల్దార్ఆఫీస్లో గతంలో పనిచేసిన కాంట్రాక్టు ఉద్యోగి నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను తయారు చేయడానికి సహకరించాడని, బ్యాంకు సిబ్బంది కొందరు వీరితో మిలాఖత్అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రైతులకు తెలియకుండానే..
ఊట్కూర్ మండలం తిప్రాస్పల్లి గ్రామంలోనే దాదాపు వంద వరకు రైతుల పేర్ల మీద వారికి తెలియకుండా లోన్లు తీసుకున్నారు. తిప్రాస్ పల్లి రైతులు పని కిష్టమ్మ, మార్కెట్ కృష్ణయ్య, జరిగేలి నరసింహ, సందపొళ్ల కిష్టమ్మ, సందపొళ్ల బాలప్పకు తెలియకుండానే క్రాప్ లోన్తీసుకున్నారు. రైతులకు నోటీసులు వచ్చేవరకు వారి పేరు పై క్రాప్ లోన్ ఉన్నట్లు తెలియదు. ఊట్కూర్ బ్యాంకు మేనేజర్ గత మంగళవారం నుంచి లీవ్లో ఉన్నారు. నకిలీ పాస్బుక్లతో లోన్లు తీసుకున్న విషయమై బ్యాంకు అధికారులు రహస్య విచారణ చేస్తున్నట్లు తెలిసింది.