ఆశ్రయించిన బాధితులు
జీడిమెట్ల,వెలుగు: పేటీఎం కేవైసీ అప్ డేట్ పేరుతో వివిధ రకాల అప్లికేషన్స్ స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేయించి సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారు. ఇలా మోసపోయిన ఇద్దరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కూకట్పల్లి జయనగర్కి చెందిన వి.రవిశంకర్ కి జనవరి 23న 8308969378 నంబర్నుంచి పేటీఎం కేవైసీ అప్ డేట్ చేసుకోవాలని మెసేజ్ వచ్చింది. రవిశంకర్ ఆ నంబర్కి కాల్ చేశాడు. అవతలి వ్యక్తి అప్ డేట్ కోసమని చెప్పి పేటీఎం వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ‘ఎనీ డెస్క్’ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని రూ.100 ట్రాన్స్ ఫర్ చేయమని చెప్పాడు. రవిశంకర్ అతడు చెప్పిన విధంగా చేశాడు. అనంతరం రవిశంకర్ పేటీఎం యాప్ కు లింక్ అకౌంట్ నుంచి రూ.65,542 డెబిట్ అయినట్లు మెసేజ్ లు వచ్చాయి. రవిశంకర్ మొదట కాల్ చేసిన వ్యక్తికి ఫోన్ చేయగా..స్విచ్చాఫ్ వచ్చింది. గత నెల 28న సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.
మరో కేసులో..
సంగారెడ్డికి చెందిన ఫక్రుద్దీన్ మహ్మద్ కు గత నెల 23న 8016499058 నంబర్ నుంచి కాల్ వచ్చింది. పేటీఎం నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి కేవైసీ అప్ డేట్ చేయాలని క్విక్ సపోట్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని అవతలి వ్యక్తి అన్నాడు.అప్డేట్కోసం ఆ యాప్ లో వివరాలు నమోదు చేయాలన్నాడు. ఆ తర్వాత ఆ యాప్ నుంచి రూ.1 ట్రాన్స్ ఫర్ చేయాలని కోరాడు. ఫక్రుద్దీన్ అప్లికేషన్లో అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే పేటీఎంకు లింక్ ఉన్న ఆంధ్రాబ్యాంక్ నుంచి రూ.16 వేలు, ఎస్ బీఐ నుంచి రూ.7 వేలు, మరో అకౌంట్ నుంచి రూ,55,399..మొత్తం రూ.78,399 డెబిట్ అయ్యాయి. మోసపోయినట్టు గుర్తించిన ఫక్రుద్దీన్ జనవరి 31న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.