బీహార్లో కరోనా వ్యాక్సిన్ని అందరికీ ఉచితంగా ఇస్తామన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల క్రమంలో ఇవాళ(గురువారం) నిర్మలా సీతారామన్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో వ్యాక్సిన్ అందరికీ ఫ్రీగా ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. బీహార్లోని 243 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 28న తొలిదశ, నవంబరు 3, 7 తేదీల్లో రెండో, మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలను నవంబరు 10న విడుదల చేస్తారు. తమ ప్రభుత్వ పాలనలో బీహార్లో 15 ఏళ్లలో జీడీపీ 3 శాతం నుంచి 11.3 శాతానికి పెరిగిందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
బీహార్లో ప్రతి ఒక ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా ఇస్తామన్నది ఈ ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఇస్తోన్న తొలి హామీ అని అన్నారు సీతారామన్. ఎన్డీఏను రాష్ట్రప్రజలు గెలిపించాలని అన్నారు. బీహార్లో మరో 5 సంవత్సరాల పాటు నితీశ్ కుమార్ సీఎంగా ఉంటారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నితీశ్ పాలనలోనే బీహార్ ఉత్తమ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. బీహార్లో 19 లక్షల ఉద్యోగాల కల్పన, మరో 3 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, రాష్ట్రాన్ని ఐటీ హబ్గా తయారు చేయడం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల మందికి పక్కా ఇళ్లు, 9 తరగతి నుంచి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ వంటి అంశాలను బీజేపీ తమ మేనిఫెస్టోలో చేర్చింది. అంతేకాదు.. ఇతర రాష్ట్రాలలో చనిపోయిన వలస కూలీ కుటుంబానికి 2 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుడి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం, వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు మేనిఫెస్టోలో తెలిపారు.