కిరాణా షాపు య‌జ‌మాని మంచి మ‌న‌సు: ఫ్రీగా నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు

కిరాణా షాపు య‌జ‌మాని మంచి మ‌న‌సు: ఫ్రీగా నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు

లాక్ డౌన్ క్ర‌మంలో ఇదే అదునుగా కొంద‌రు కిరాణా షాపు య‌జ‌మానులు ఇష్టం వ‌చ్చిన‌ట్లు ధ‌ర‌లు పెంచి అమ్ముతున్న విష‌యం తెలిసిందే. ఇలాంటి స‌మ‌యంలో త‌న గ్రామంలోని కూలీలు, నిరు పేద‌ల‌ కోసం గొప్ప నిర్ణ‌యం తీసుకున్నాడు ఓ కిరాణా షాపు య‌జ‌మాని. త‌న వంతు సాయంగా ఒక్క రోజు నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు ఫ్రీగా ఇస్తాన‌ని తెలిపాడు. ఈ సంద‌ర్భంగా కిరాణా షాపు ముందు ఓ బ్యాన‌ర్ క‌ట్టాడు. దీంతో ఈ ఫోటో వాట్సాప్ గ్రూపుల్లో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా .. కిరాణా షాపు య‌జ‌మానిపై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద పెద్ద కోటీశ్వ‌రులు ఇత‌డిని చూసి నేర్చుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఎంత సేపు.. ఏం పని చేశాం.. ఎంత సంపాదించాం.. ఎంత వెనకేసుకున్నాం.. అని లెక్కలేసుకోవచ్చు. కానీ ఉన్నదానిలో సంత్రుప్తి పడి లేనివాళ్లకు ఇవ్వడంలో వచ్చే ఆనందం కోట్లు కూడ బెట్టినోళ్ళకు కూడా దొరకదేమో.. అంటూ మ‌రి కొంద‌రు చెబుతున్నారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పేదల ఆకలి తీర్చాలన్న ఓ మంచి పని కోసం నడుం బిగించినందుకు ధ‌న్య‌వాదాలంటూ మొక్కుతున్నారు. ఈ కిరాణా షాపు య‌జ‌మానిది హైదరాబాద్ శివారులోని..రంగారెడ్డి జిల్లా, బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్, 6వ వార్డు గుర్రంగూడ.