బడులు తెరిచే రోజే స్టూడెంట్స్ కు.. టెక్స్ట్​బుక్స్, యూనిఫామ్స్

బడులు తెరిచే రోజే స్టూడెంట్స్ కు.. టెక్స్ట్​బుక్స్, యూనిఫామ్స్

మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12న బడులు తెరుచుకోనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, జిల్లా పరిషత్ హై స్కూల్స్ 3,223 ఉన్నాయి. వాటిల్లో 3,10,387 మంది స్టూడెంట్స్​ చదువుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బడులు రీ ఓపెన్ అయ్యే రోజునే స్టూడెంట్స్​కు ఫ్రీ టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్​ అందించేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

సిద్దిపేట జిల్లాలో..

జిల్లా పరిధిలో మొత్తం 987 గవర్నమెంట్  స్కూల్స్ లో 96 వేల మంది స్టూడెంట్స్​చదువుతున్నారు. తరగతుల వారీగా 5.39 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం కాగా ఇప్పటి వరకు 4.96 వేల పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. వాటిని మండల వనరుల కేంద్రాల  ద్వారా 92 శాతం పంపిణీ పూర్తి చేశారు. స్కూల్స్​ప్రారంభమయ్యే నాటికి మిగిలిన 41 వేల పుస్తకాలు జిల్లాకు చేరుతాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. నాలుగో తరగతి తెలుగు, ఎనిమిదో తరగతి హిందీ పాఠ్య పుస్తకాలు ఇంకా జిల్లాకు చేరకపోగా స్కూల్స్ ప్రారంభం నాటికి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే స్టూడెంట్స్​కు యూనిఫామ్స్ ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 

జిల్లాలోని 3.5 లక్షల మీటర్ల  స్కూల్ యూనిఫామ్ క్లాత్ అవసరం కాగా ఇప్పటి వరకు 1.75 లక్షల మీటర్ల క్లాత్ చేరుకోగా వాటితో యూనిఫామ్స్ ను కుట్టిస్తున్నారు. జిల్లాలోని గవర్నమెంట్ స్కూల్స్ లో 48 వేల మంది బాలికలు, 47 వేల మంది బాలురు చదువుతుండగా వీరందరికి యూనిఫామ్స్ ను ప్రభుత్వం అందిస్తున్నది. 1 నుంచి 3 వ తరగతి బాలికలకు ఫ్రాక్స్, 5,6 తరగతుల్లోని బాలికలకు స్కర్ట్స్, 6 నుంచి 10 వ తరగతి చదివే బాలికలకు పంజాబీ డ్రెస్ తో పాటు చున్నీని  1 నుంచి 3 వ తరగతి చదివే బాలురకు నెక్కర్, షర్ట్ ఆపై తరగతుల వారికి ప్యాంట్ షర్ట్ ను అందిస్తారు. నెల రోజుల ముందే మొత్తం క్లాత్ జిల్లాకు చేరి ఉంటే యూనిఫామ్స్ కుట్టే పనులు  స్కూల్స్ ప్రారంభం నాటికి పూర్తయ్యేవి కాని క్లాత్ ఆలస్యంగా రావడం వల్ల స్కూల్స్ ప్రారంభం నాటికి  అందరికి యూనిఫామ్స్ అందే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.

సంగారెడ్డి జిల్లాలో.. 

జిల్లాలో మొత్తం 1,280 గవర్నమెంట్  స్కూల్స్ ఉండగా తరగతుల వారీగా 7,33,154 పాఠ్య పుస్తకాలు అవసరం కానున్నాయి. ఇప్పటి వరకు 6,74,130 పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. ఆయా మండల వనరుల కేంద్రాల  ద్వారా 5,57,955 పుస్తకాలను పంపిణీ చేశారు. ఇంకా 59,024 పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉన్నాయి. స్కూల్స్ ఓపెన్ అయ్యే నాటికి బ్యాలెన్స్  పుస్తకాలు జిల్లాకు చేరతాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. గవర్నమెంట్ స్కూల్స్ యూనిఫామ్ విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,09,319 స్టూడెంట్స్ ఉండగా, 98,430 యూనిఫామ్స్​ రెడీ అయ్యాయి. మిగితా 10,889 మందికి కుట్టాల్సి ఉండగా ఈనెల 11 నాటికి రెడీ చేయిస్తామని అధికారులు చెబుతున్నారు.

మెదక్  జిల్లాలో..

జిల్లాలోని 21 మండలాల పరిధిలో ప్రభుత్వ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, జిల్లా పరిషత్ హై స్కూల్స్ 956 ఉన్నాయి. ఆయా స్కూల్స్ లో మొత్తం 84,387 మంది స్టూడెంట్స్​ఉన్నారు. 2025 -–26 విద్యా సంవత్సరానికి గాను ఒకటి నుంచి 10 వ తరగతి వరకు మొత్తం 4,60,450 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా రాష్ట్ర గోదాం నుంచి జిల్లా గోదాం కు ఇప్పటి వరకు 4,48,148 పుస్తకాలు చేరుకున్నాయి. జిల్లా గోదాము నుంచి ఇండెంట్ కు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను మండల వనరుల కేంద్రాలకు పంపిణీ చేస్తున్నారు.

 అక్కడి నుంచి మండల పరిధిలో ఉన్న స్కూళ్లకు తరలించి రీ ఓపెనింగ్ రోజు స్టూడెంట్స్​కు అందజేస్తారు. 821 స్కూళ్లలో చదువుకునే 62,146 మంది స్టూడెంట్స్ కు అవసరమైన ఒక జత యూనిఫామ్స్​డీఆర్డీఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో కుట్టించారు. ఈ నెల 10 లోపు సంబంధిత స్కూల్స్​కు యూనిఫామ్స్​చేరవేసేందుకు విద్యశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.