- సైబర్ క్రిమినల్స్కు సీఎస్బీ షాక్
- మనీ ట్రాన్స్ ఫర్ కాకుండా పోలీసుల యాక్షన్
హైదరాబాద్,వెలుగు : సైబర్ క్రిమినల్స్ కు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ) పోలీసులు చెక్ పెట్టారు. ఆన్ లైన్ లో కొట్టేసిన డబ్బు వారికి చేరకుండా అడ్డుకట్ట వేశారు. బాధిత మహిళ1930కు కంప్లయింట్ చేయగా వెంటనే అలర్ట్ అయి రూ.60లక్షలు సైబర్ ఫ్రాడ్స్ అకౌంట్స్లోకి వెళ్లకుండా ఫ్రీజ్ చేశారు. సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ శుక్రవారం వివరాలను వెల్లడించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండే ఓ మహిళకు బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తుల నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
మహారాష్ట్ర పోలీసులమని ఆమెపై మనీ లాండరింగ్ కేసు నమోదైనట్లు బెదిరించారు. అంతేకాకుండా స్కైప్లో వీడియో కాల్స్ ద్వారా ఇంటరాగేషన్ పేరుతో రాత్రంతా వేధించారు. కేసునుసెటిల్ చేసుకోవాలంటే అడిగినంత డబ్బు ఇవ్వాలని ఆమెను హెచ్చరించారు. దీంతో బాధిత మహిళ రూ.60లక్షలు నిందితులు చెప్పిన అకౌంట్స్ కు ట్రాన్స్ఫర్ చేసింది. అనంతరం మోసపోయానని గుర్తించింది. వెంటనే 1930కు కాల్ చేసి కంప్లయింట్ చేసింది. దీంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అలర్ట్ అయ్యారు.
సిటిజన్ ఫైనాన్సియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్(సీఎఫ్సీఎఫ్ఆర్) పోర్టల్ ద్వారా ఎస్బీఐ బ్యాంక్ నోడల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తద్వారా సైబర్ నేరగాళ్ల అకౌంట్స్లోకి రూ.60 లక్షలు ట్రాన్స్ఫర్ కాకుండా ఫ్రీజ్ చేయించారు. ఇలాంటి సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మోసం జరిగిన వెంటనే 1930కు ఫిర్యాదు చేస్తే గోల్డెన్ అవర్స్లో వెంటనే డబ్బును ఫ్రీజ్ చేయగలమని సూచిస్తున్నారు.
