భయంతో స్నేహితుడి మృతదేహాన్ని చెట్లలో పడేసిన స్నేహితులు

భయంతో స్నేహితుడి మృతదేహాన్ని చెట్లలో పడేసిన స్నేహితులు

వీడిన మిస్టరీ.. చేపల వేటకు వెళ్లి అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం

అనుకోకుండా స్నేహితుడు చనిపోవడంతో.. భయపడిన మిగతా స్నేహితులు అతని మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. దాదాపు 40 రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. సారంగాపూర్ మండలం నగునూరుకు చెందిన రాజశేఖర్, మల్లేశం, రాజిరెడ్డి ముగ్గురూ స్నేహితులు. ఈ ముగ్గురు జూలై మొదటి వారంలో అదే గ్రామంలో చేపల వేటకు వెళ్లారు. అయితే అక్కడ చెరువులో చేపల కోసం పెట్టిన కరెంట్ వైర్ రాజశేఖర్ కాలికి తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దాంతో భయపడ్డ మల్లేశం, రాజిరెడ్డిలు రాజశేఖర్ మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి.. ఏమీ తెలియనట్లుగా ఇళ్లకు వెళ్లిపోయారు. రాజశేఖర్ కనిపించకపోవడంతో ఆయన కుటుంబసభ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నపోలీసులు.. రాజశేఖర్ కనిపించకుండాపోయిన రోజు ఎవరితో తిరిగాడో తెలుసుకొని వారిని విచారించారు. దాంతో మల్లేశం, రాజిరెడ్డి అసలు విషయం బయటపెట్టారు. వీరి స్టేట్ మెంట్ తో 40 రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోయిన రాజశేఖర్ చనిపోయినట్లు పోలీసులు నిర్దారించారు. చేపల వేట కోసం అమర్చిన కరెంటు తీగ తగిలి అదే రోజు రాజశేఖర్ మృతి చెందినట్లు మల్లేషం, రాజిరెడ్డిలు తెలిపారు. భయంతో మృతదేహాన్ని దగ్గరలోని చెట్ల పొదల్లో పడేసినట్లు పోలీసు విచారణలో ఒప్పుకున్నారు. నిందితుల సమాచారం మేరకు.. చెరువు సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రాజశేఖర్ అస్తిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని.. రిమాండ్ కు తరలించారు.

For More News..

కరోనాకు మరో మాజీ ఎంపీ బలి

ఆన్‌లైన్ ఫార్మసీలోకి అమెజాన్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హెల్త్ బులెటిన్ విడుదల