
- హిండెన్ బర్గ్ రిపోర్ట్ను సెబీ తోసిపుచ్చడంపై గౌతమ్ అదానీ
న్యూఢిల్లీ: హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలను సెబీ తోసిపుచ్చడాన్ని, తమ గవర్నెన్స్కు, పారదర్శకతకు, నిజాయితీకి నిదర్శనంగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అభివర్ణించారు. 2023 జనవరిలో వచ్చిన హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత, అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.8 లక్షల కోట్లు తగ్గిన విషయం తెలిసిందే. సెబీ తాజా నిర్ణయం ఈ రెండు సంవత్సరాలుగా కొనసాగిన దర్యాప్తుకు ముగింపు అని షేర్హోల్డర్లకు రాసిన లెటర్లో ఆయన పేర్కొన్నారు. "హిండెన్బర్గ్ చేసిన దాడి కేవలం అదానీ గ్రూప్పై కాదు, ప్రపంచ స్థాయిలో ఎదగాలనుకునే భారతీయ సంస్థల ధైర్యంపై నేరుగా సవాల్" అని అన్నారు.
సెబీ గత వారం అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ చేసిన మార్కెట్ మానిప్యులేషన్ ఆరోపణలను తోసిపుచ్చింది. సంబంధిత కంపెనీల మధ్య నిధుల మార్పిడిపై చేసిన మోసపూరిత ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ పోర్టులు, బొగ్గు, పునరుత్పాదక శక్తి, మీడియా, విమానాశ్రయాలు వంటి వివిధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. "మమ్మల్ని బలహీనపరచాలని ప్రయత్నించారు. కానీ, మా పునాది మరింత బలంగా మారింది" అని అదానీ లెటర్లో పేర్కొన్నారు.
"ఇది కేవలం రెగ్యులేటరీ క్లియరెన్స్ కాదు, మా కంపెనీ ఎప్పటినుంచో పాటిస్తున్న పారదర్శకత, గవర్నెన్స్, లక్ష్యానికి శక్తివంతమైన ఆధారం" అని అన్నారు. హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత, మార్కెట్ క్యాపిటలైజేషన్ పూర్తిగా రికవరీ కాలేకపోయినా, ఆపరేషనల్ పరంగా గ్రూప్ తిరిగి పుంజుకుంది. గత రెండు సంవత్సరాల్లో అదానీ గ్రూప్ ఇబిటా (వడ్డీలు, పన్నులకు ముందు ప్రాఫిట్) 57శాతం పెరిగి రూ.89,806 కోట్లకు చేరింది. గ్రాస్ బ్లాక్ ఆస్తులు 48శాతం పెరిగి రూ.6.1 లక్షల కోట్లకు చేరాయి.
అదానీ గ్రూప్ సాధించిన విజయాలు..
అదానీ గ్రూప్ గత రెండు సంవత్సరాల్లో సాధించిన ప్రధాన మైలురాళ్లను గౌతమ్ అదానీ వివరించారు. కేరళలోని విజింజంలో దేశంలోనే మొట్టమొదటి కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ప్రారంభించామని, ఖవ్డా ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో 6 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని జోడించామని అన్నారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్ స్మెల్టర్, మెటలర్జికల్ కాంప్లెక్స్ ప్రారంభించాం. 4 గిగావాట్ల కొత్త థర్మల్ ఎనర్జీ కెపాసిటీ, దేశవ్యాప్తంగా, విదేశాల్లో 7 వేల సర్క్యూట్ కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్లు వేశాం”అని ఆయన వివరించారు.