సైక్లింగ్ స్టార్లకు ఫండింగ్ ప్రాబ్లమ్ ..రాష్ట్రస్థాయి మౌంటెన్ పోటీల్లో ములుగు జిల్లాకు12 మెడల్స్

సైక్లింగ్ స్టార్లకు ఫండింగ్ ప్రాబ్లమ్ ..రాష్ట్రస్థాయి మౌంటెన్ పోటీల్లో ములుగు జిల్లాకు12 మెడల్స్
  • నిధులు లేక జాతీయ క్రీడల్లో పాల్గొనలేకపోయిన క్రీడాకారులు 
  • ములుగు జిల్లాలో 30 మందికి ఉన్న సైకిళ్లు నాలుగు మాత్రమే 
  • నిధుల కొరతను తీర్చాలంటున్న శిక్షణ తీసుకునే విద్యార్థులు

ములుగు, వెలుగు : సైక్లింగ్​స్టార్లకు ఫండింగ్​ప్రాబ్లమ్ వచ్చింది. ములుగు జిల్లా సైక్లింగ్​అసోసియేషన్​ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కోచ్​ను నియమించగా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సైక్లింగ్ క్రీడాకారులు మెడల్స్ సాధిస్తున్నా రు. కాగా.. జాతీయ స్థాయిలో ఆడేందుకు నిధుల కొరత సమస్యగా మారింది. రాష్ట్రస్థాయిలో ఓవరాల్​చాంపియన్ షిప్ గెలిచినా కూడా జాతీయస్థాయి పోటీలకు వెళ్లలేకపోవడంతో సైక్లింగ్ క్రీడాకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  జిల్లాలో 2 మౌంటెన్, 2 రోడ్​సైకిళ్లు మాత్రమే ఉండగా, మిగిలినవి 10 జనరల్​సైకిళ్లు. దీంతో విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వలేకపోతున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొనాలన్నా ఇబ్బందిగా మారింది.

రెండేండ్ల కింద షురువైన సైక్లింగ్ 

 జిల్లాలో సైక్లింగ్​ను క్రీడగా ఎంపిక చేసుకున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ పోటీల్లో పాల్గొనేలా చేస్తున్నారు. 2023లో వరంగల్ ​జిల్లా సైక్లింగ్​అసోసియేషన్​అధ్యక్షుడు కన్నెబోయిన సారయ్య ఆధ్వర్యంలో ములుగు జిల్లా సైక్లింగ్​అసోసియేషన్​ఏర్పాటైంది.  ప్రత్యేక కోచ్ ను నియమించి సైక్లింగ్​లో శిక్షణ ఇవ్వగా విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించారు. జిల్లాలోని బండారుపల్లి రోడ్డులో రోజూ ఉదయం, సాయంత్రం సైక్లింగ్​శిక్షణ ఇస్తారు. కేంద్రం నుంచి రాష్ట్ర స్పోర్ట్స్ శాఖ ద్వారా ఏటా రూ.2 లక్షలు నిధులు వస్తాయి. అందులో సైక్లింగ్​క్రీడాకారులకు 14సైకిళ్లను కొనుగోలు చేశారు. మౌంటైన్, రోడ్​, ట్రాక్​ విభాగాల్లో సైక్లింగ్ పోటీలు జరుగుతుంటాయి.   

వేధిస్తోన్న నిధుల కొరత  

హైదరాబాద్​లో గత మార్చిలో జరిగిన ఖేలో ఇండి యా సైక్లింగ్​ మౌంటెన్ పోటీల్లో ములుగు జిల్లా విద్యార్థులు 12, 14, 16, 18 ఏండ్ల విభాగాలతో పాటు మెన్​ఎలైట్​విభాగంలో రాణించారు. క్రీడాకారులు నవీన్​, దివ్య, ఐషు, సాయిచరణ్​, వర్షిణి, కుష్వంత్​, చక్రవర్తి ప్రతిభ చూపి..  5 గోల్డ్, 4 సిల్వర్, 3 బ్రాంజ్​మెడల్స్​సాధించారు. జిల్లా ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో చాటడడమే కాకుండా ఓవరాల్​చాంపియన్​షిప్​ కూడా ములుగు దక్కించుకోవడం విశేషం.  అదేవిధంగా ఈనెల1, 2వ తేదీల్లో చౌటుప్పల్​లో జరిగిన సైక్లింగ్​క్రీడల్లో క్రీడాకారిణి ఐషు నాల్గో స్థానం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. కాగా నిధుల కొరతతో పోటీల్లో పాల్గొనలేకపోయింది. దీంతో క్రీడల శాఖ ఆఫీసర్లు స్పందించి తగిన ప్రోత్సాహం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. సరైన శిక్షణ ఉండి ఆర్థికంగా సపోర్టు చేస్తే  రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ములుగు జిల్లా పేరును నిలబెడతారని పేర్కొంటున్నారు. మరోవైపు జిల్లా సైక్లింగ్​అసోసియేషన్​ కమిటీ పూర్తిస్థాయిలో రిజిస్టర్​కాకపోవడంతో కూడా సైక్లింగ్​కు సరైన సపోర్టు దొరకడం లేదని అంటున్నారు.

ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాం 

ములుగు జిల్లా నుంచి సైక్లింగ్​లో  ప్రస్తుతం 25 నుంచి 30మంది క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాం. 14 సైకిళ్లు ఉండగా, అందులో 4 మాత్రమే మౌంటైన్, రోడ్​ సైక్లింగ్​ పోటీల్లో పాల్గొనేవి. దీనిపై రాష్ట్ర, జాతీయ స్థాయి సైక్లింగ్​ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే జిల్లాకు మరిన్ని సైకిళ్లు వచ్చే చాన్స్  ఉంది. నిధులు కొరత లేకుండా క్రీడాకారులను జాతీయస్థాయిలో రాణించేలా శిక్షణ అందిస్తాం.    

- కేలోతు శ్రీరాం, సైక్లింగ్ ​కోచ్,ములుగు జిల్లా-