అసైన్డ్ ​భూములను గుంజుకునేందుకే ధరణిని తెచ్చారు

అసైన్డ్ ​భూములను గుంజుకునేందుకే ధరణిని తెచ్చారు

వికారాబాద్, వెలుగు: వికారాబాద్​అనంతగిరి గడ్డ నుంచే ‘ధరణి పోర్టల్’పై దండయాత్ర మొదలైందని మాజీ మంత్రి, కాంగ్రెస్​ పార్టీ సీనియర్ ​నేత గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ ​భూములను గుంజుకునేందుకే ధరణిని తెచ్చారని ఆరోపించారు. బుధవారం ఆయన వికారాబాద్​లో ధరణి పోర్టల్​సమస్యలపై నిరసన దీక్ష చేపట్టారు. సాయంత్రం కాంగ్రెస్​ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆయనకు ​నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం గడ్డం ప్రసాద్​ మాట్లాడుతూ.. నవాబ్ పేట మండలం ఆర్కతల గ్రామంలో 800 ఎకరాలు అసైన్డ్​ భూమిని కేటీఆర్ బంధువల పేరున కొన్నారని చెప్పారు. మోమిన్ పేట మండలం ఎన్కతల గ్రామంలో మరో 800 ఎకరాల అసైన్డ్​ భూమికి అగ్రిమెంట్ చేసుకున్నారని ఆరోపించారు. 

కరీంపూర్​లోని 63 మంది రైతులకు చెందిన145 ఎకరాలు ధరణి రికార్డుల్లో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏండ్లుగా సాగుచేసుకుంటున్న భూములను సీఎం కేసీఆర్​ధరణిని అడ్డుపెట్టుకొని జిల్లా కలెక్టర్​తో చీకటి రికార్డులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మర్పల్లి మండలం పట్లూరులో 37 ఎకరాలు, గుండ్లమర్పల్లి శివారులో 32 ఎకరాల భూములకు అక్టోబర్1న పాస్​ పుస్తకాలు జారీ చేయడమే ఇందుకు సాక్ష్యం అన్నారు. ప్రసాద్ ​కుమార్ ప్రారంభించిన దీక్షను అన్ని జిల్లాల్లో చేపడతామని అద్దంకి దయాకర్ ​తెలిపారు. కేసీఆర్ ఇప్పటికే 2లక్షల ఎకరాలు దోచుకున్నాడని ఆరోపించారు. త్వరలో ముందస్తు ప్రకటన లేకుండా కలెక్టరేట్లను ముట్టడిస్తామని వెల్లడించారు. జిల్లా రైతు నాయకులు రత్నారెడ్డి, సుధాకర్ రెడ్డి, కిషన్ నాయక్, ధరణి బాధితులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.