తెలంగాణ కోసం పోరాడిన అమరుల ఉసురు తగిలి పోతావ్ అంటూ సీఎం కేసీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు ప్రజా గాయకుడు గద్దర్. వికారాబాద్ జిల్లా పరిగిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ సమస్య అంటే భూమి సమస్య అన్న గద్దర్.. ఆనాడు 200 ఏళ్ళు పరిపాలించిన నిజాం రాజు భూమంతా తనేదనని విర్రవీగాడని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ధరణి పేరుతో హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 25 లక్షల ఎకరాల భూమిని తన దగ్గర పెట్టుకున్నాడని ఆరోపించారు.
భూ సమస్యలు, భూ తగాదాలు పెట్టిన కేసీఆర్ .. నీ పాలన కూల్చేస్తామని గద్దర్ హెచ్చరించారు. కూల్చేసే దాంట్లో తనది ప్రధాన పాత్ర ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. మా భూములు మాకే, మా నీళ్లు మాకే అని పోరాడి తెలంగాణ తెచ్చుకున్నం..ఇప్పుడు గరీబోని భూమి గుంజుకుని కోట్లకు పడగలెత్తిన కంపెనీలకు ఇస్తున్నవ్ అని కేసీఆర్ పై మండిపడ్డారు.
భూమి జోలికొస్తే ఊరుకునేది లేదని, ఖబద్దార్ అని బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను గద్దర్ హెచ్చరించారు. దొరల అధీనంలో ఉన్న వేల ఎకరాల భూమిలో నాగండ్లు కడుతామని, భూమిని దున్నినట్లు నీ పాలన దున్నేస్తామని కేసీఆర్ పై గద్దర్ ఘాటు విమర్శలు చేశారు గద్దర్.