కామారెడ్డి/తాడ్వాయి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో బుధవారం పలుచోట్ల యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం నుంచే రైతులు సొసైటీలు, గోదాముల వద్ద క్యూలో నిలబడ్డారు. తాడ్వాయి మండలం ఎండ్రియాల్, నందివాడ లో వేకువ జాము నుంచే వందల మంది రైతులు బారులు తీరారు. రెండు రోజులుగా యూరియా లేకపోవటం లారీ లోడ్ మాత్రమే రావటంతో రైతులు పోటీపడి లైన్లో ఉన్నారు.
భిక్కనూరు మండలం జంగంపల్లి సొసైటీ ముందు కూడా రైతులు యూరియా కోసం లైన్లో బారులుదీరారు. యూరియా దొరుకుతుందో లేదో అన్న సందిగ్ధంతో రైతుల ముందస్తు జాగ్రత్తగా యూరియాను కొనుగోలు చేస్తున్నారని తాడ్వాయి ఏవో నర్సింలు తెలిపారు. మండలంలో అన్ని సొసైటీ పరిధిలో రేపటి నుంచి యూరియా అందుబాటులోకి వస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
యూరియా స్టాక్ పరిశీలించిన జేడీఏ
నిజామాబాద్ : నిజామాబాద్జిల్లాలో యూరియా బస్తాల నిల్వలు పరిశీలించడానికి బుధవారం స్టేట్ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి జేడీఏ షర్మిల వచ్చారు. ఇందల్వాయి, తిర్మన్పల్లి, భర్థీపూర్ సింగిల్ విండో గోదామ్లు విజిట్ చేసి యూరియా స్టాక్ను ఆఫీస్ రికార్డులతో క్రాస్ చెక్ చేశారు. అన్ని సంఘాల్లో సీజన్కు కావాల్సిన నిల్వలు ఉన్నాయని నిర్ధారించుకున్నారు. తరువాత డీఏవో వీరస్వామి, డీసీవో శ్రీనివాస్, మార్క్ ఫెడ్ ఆఫీసర్లతో సమావేశమై సూచనలు ఇచ్చారు.
