గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం.. రాత్రంతా తిరగనున్న ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు, బస్సులు

గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం.. రాత్రంతా తిరగనున్న ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు, బస్సులు

గణేష్ నిమజ్జనానికి మహానగరం రెడీ అయింది. హుస్సేన్‌సాగర్‌తో పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చోట్ల రేపు(సెప్టెంబర్ 28) నిమజ్జనాలు జరగనున్నాయి. దీనికోసం జీహెచ్‌ఎంసీ క్రేన్లు, జేసీబీలు, టిప్పర్లతోపాటు వేలాదిమంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. 

నిమజ్జనం రోజున(సెప్టెంబర్ 28) ప్రజల సౌకర్యార్థం హుస్సేన్ సాగర్‌కు నగరం నలుమూలల నుంచి 535 బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అదేవిధంగా సెప్టెంబర్ 29 తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడపనున్నామని తెలిపారు. మరోవైపు మెట్రో రైళ్లు కూడా రేపు(సెప్టెంబర్ 28) అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు నడపనున్నామని అధికారులు వెల్లడించారు. 

నిమజ్జనం చేసే సమయంలో ప్రమాదవశాత్తు ఎవరైనా నీళ్లలో పడిపోతే.. వారిని రక్షించేందుకు 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు అధికారులు. అలాగే, శోభాయాత్ర జరిగే రహదారులపై వైద్య శిబిరాలు, 79 అగ్నిమాపక వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. నిమజ్జనానికి తరలివచ్చే భక్తుల కోసం జలమండలి 10 లక్షల వాటర్ ప్యాకెట్లను రెడీ చేసింది.

మహాగణపతి నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ పరధిలో మొత్తం 40 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 25 వేల మందికిపైగా పోలీసులను భద్రతా చర్యలు చేపట్టనున్నారు. 

35 సంవత్సరాల తర్వాత మిలాద్ ఉన్ నబీ.. గణేశ్ నిమజ్జనం ఒకేసారి రావడంతో పోలీసు ఉన్నతాధికారులు ముందు జాగ్రత్త చర్యగా ముస్లిం మతపెద్దలతో మాట్లాడారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీని అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేయించారు. కొందరు ముస్లింలు మాత్రం అదే రోజున మిలాద్ ఉన్ నబీ ర్యాలీని జరపాలని పట్టుబడుతున్నారు. 

మహా గణపతులను గంగమ్మ చెంతకు చేర్చేందుకు 16 టైర్లతో కూడిన 250 టస్కర్లు, మరో 2 వేల ఇతర వాహనాలను రవాణాశాఖ సిద్ధం చేసింది. అయితే వీటిని ఈరోజు(సెప్టెంబర్ 27) సాయంత్రం 6 గంటల వరకు అందించనున్నారు.