మెదక్​జిల్లాలో ఏపి, మహారాష్ట దొంగల ముఠా అరెస్టు

మెదక్​జిల్లాలో ఏపి, మహారాష్ట దొంగల ముఠా అరెస్టు

మెదక్ టౌన్, వెలుగు :  సెల్​ఫోన్ టవర్ల మెటీరియల్​దొంగతనం చేసే అంతర్​రాష్ట్ర దొంగల ముఠాను మెదక్​పోలీసులు అరెస్ట్​ చేశారు. గురువారం ఎస్పీ బాలస్వామి చోరీకి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. మెదక్​జిల్లా తూప్రాన్​ సబ్​డివిజన్​పరిధిలోని చేగుంట మండలం రామంతాపూర్​, రాంపూర్​ గ్రామాల్లో ఈనెల 13, 14 తేదీల్లో ఎయిర్​టెల్​బ్రాడ్​బాండ్​ మెటీరియల్​ చోరీ అయినట్లు కంపెనీ సిబ్బంది చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఎయిర్​టెల్​కంపెనీలో సూపర్​వైజర్​గా పని చేస్తున్న కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లికి చెందిన మాసాని మహేశ్ ఆధ్వర్యంలోనే చోరీలు జరుగుతున్నట్లు గుర్తించారు.

అనంతరం పోలీసులు మహేశ్​ను విచారించగా తనతో పాటు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూరుకు చెందిన కైదాపూర్​సంతోశ్​ రెడ్డి, కామారెడ్డి పట్టణానికి చెందిన గోవూరి రత్నాకర్​రెడ్డి, రాఘవపల్లికి చెందిన కర్రోళ్ల రాజాగౌడ్​కలిసి చోరీలు చేస్తామని చెప్పాడు. వీటిని అమ్మేందుకు హైదరాబాద్​ రిసాలా బజార్​కు చెందిన అనిల్, ముషీరాబాద్​కు చెందిన మహ్మద్, అఫ్రోజ్ పాషా, కామారెడ్డి జిల్లా వికాస్​నగర్​కు చెందిన పగిడిపల్లి అశోక్ సాయం చేస్తారన్నాడు.

వీరందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారని ఎస్పీ వివరించారు. ఈ ముఠా దగ్గరి నుంచి ఇన్నోవా, హ్యుందాయ్, బెలెనో కారుతో పాటు మోటారు బైక్​, ఏడు సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ఎస్పీ మహేందర్, తూప్రాన్​ డీఎస్పీ యాదగిరిరెడ్డి, రామాయంపేట సీఐ లక్ష్మీబాబు, చేగుంట ఎస్​ఐ హరీశ్​ పాల్గొన్నారు.