వివాహితపై గ్యాంగ్‍ రేప్‍.. డ్రైవర్‍, మరో ఇద్దరి అఘాయిత్యం

వివాహితపై గ్యాంగ్‍ రేప్‍.. డ్రైవర్‍, మరో ఇద్దరి అఘాయిత్యం
  • వివాహితపై గ్యాంగ్‍ రేప్‍
  • ప్రయాణికురాలిపై డ్రైవర్‍, మరో ఇద్దరి అఘాయిత్యం
  • హనుమకొండ పీఎస్‍ పరిధిలో రెండు రోజుల కింద  ఘటన

గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలో అర్ధరాత్రి ఇంటికెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ వివాహితపై డ్రైవర్‍తో పాటు మరో ఇద్దరు అత్యాచారం చేశారు.  రెండు రోజుల కింద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
    
వరంగల్‍, వెలుగు:  వరంగల్‍ పరిధిలో అర్ధరాత్రి ఇంటికెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ వివాహితను డ్రైవర్‍తో పాటు మరో ఇద్దరు గ్యాంగ్‍ రేప్‍ చేశారు. రెండు రోజుల కింద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమకొండ నయీంనగర్‍లోని రంగ్‍బార్‍ ప్రాంతానికి చెందిన ఓ యువతి రాత్రి భర్తతో గొడవ పడింది. కోపంతో ఇంట్లో నుంచి బయటకొచ్చింది. ఏం చేయాలో తెలియక నయీంనగర్‍, కేయూ, గోపాల్‍పూర్‍ ఏరియాల్లో తిరిగింది. చివరకు ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది.

అటుగా వెళ్తున్న ఆటోను ఆపి ఎక్కింది. అర్ధరాత్రి కావడంతో రోడ్లపై జనాలు పెద్దగా లేరని గ్రహించిన ఆటో డ్రైవర్‍ రాకేశ్‍ ఆమెను బీమారం ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అప్పటికే అతని మిత్రులైన సనత్‍, సతీశ్​లకు విషయం చెప్పి రమ్మనడంతో వారు కూడా వచ్చారు. ఈ ముగ్గురు కలిసి ఆమెను రేప్​చేశారు. తర్వాత ఎలాగో ఇంటికి చేరుకున్న బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యాన్ని భర్తకు చెప్పుకుంది. దీంతో శుక్రవారం హనుమకొండ పోలీస్‍ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం.