న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శనివారం రాత్రి పోలీసులు వారిని ప్రయాగ్రాజ్లోని ఆస్పత్రికి మెడి కల్ చెకప్కు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మీడియాతో అతీక్, అష్రఫ్ మాట్లాడుతుండగా.. అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు వారిపై అతి సమీపం నుంచి (పాయింట్ బ్లాంక్ రేంజ్) కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరూ స్పాట్లోనే చనిపోయారు. చుట్టూ పోలీసులు కాపలా ఉన్నా వారు కాల్పులు జరిపారు.
ఈ ఘటనకు సంబంధించి ముగ్గురి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ హత్యలపై వారు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అతీక్ అహ్మద్ గతంలో సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. అంతకుముందు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ మర్డర్ కేసులో అతీక్ నిందితుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజు పాల్ అడ్వొకేట్ అయిన ఉమేశ్ పాల్ కూడా హత్యకు గురయ్యాడు.
ఈ హత్యలోనూ అతీక్ హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. అతనిపై మొత్తం వందకుపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. కొన్ని కేసుల్లో దోషిగా తేలాడు. కాగా, అతీక్ కొడుకు అసద్ ఈ నెల 13న ఝాన్సీలో ఎన్ కౌంటర్లో హతమయ్యాడు.