పనీర్ కనిపిస్తే పాలక్ పనీర్, పనీర్ బటర్ మసాలా కర్రీ చేస్తారు ఎవరైనా. కానీ, ఇతను మాత్రం పనీర్మీద సెలబ్రిటీల బొమ్మలు వేస్తాడు. మధ్యప్రదేశ్లోని ఆస్తాకు చెందిన ఈ ఆర్టిస్ట్ పేరు ప్రఫుల్ జైన్. ఈమధ్యే రిలీజ్ అయిన ‘గంగూబాయి కథియవాడి’ సినిమాలో ఆలియాభట్ ఫొటోని పనీర్ మీద ఆర్ట్గా వేశాడు. ఆ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ముందుగా పనీర్ మీద (పేపర్లు కత్తిరించేందుకు ఉపయోగించే) కత్తితో గంగూబాయిలా ఉన్న ఆలియాభట్ బొమ్మ గీశాడు. ఆ బొమ్మ కనిపించడం కోసం పనీర్ మీద సోయా సాస్ పోశాడు. పనీర్ మీద ఆలియాభట్ బొమ్మ గీస్తున్న వీడియోని ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు ప్రఫుల్. ఆ వీడియో చూసినవాళ్లంతా అతని క్రియేటివిటీని ఒకటే మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఈ వైరల్ వీడియోను 70 వేల మందికిపైగా లైక్ చేశారు. ప్రఫుల్ పనీర్ పెయింటింగ్ వేయడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు ‘సర్దార్ ఉద్ధమ్ సింగ్’ సినిమాలో విక్కీ కౌశల్ ఫొటోని కూడా పనీర్ మీద వేశాడు.
కొత్తగా చేయాలని...
‘‘నాకు పనీర్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు పనీర్ తినేటప్పుడు అది రెండు ముక్కలైంది. వాటిని గమనించిన తర్వాత పనీర్ మీద ఆర్ట్ వేయొచ్చని అనిపించింది. కానీ, పనీర్ మీద ఆర్ట్ వేయడం ఈజీ కాదు. పనీర్ మీద ఆర్ట్వేసి, బొమ్మ కనిపించేందుకు సోయా సాస్ పోయడం అనేది కాఫీ స్టెయిన్ టెక్నిక్ లాంటిదే. ఇంట్లో వండడానికి పనీర్ రెడీగా ఉన్నప్పుడు ఇలాంటి ఆర్ట్స్ వేస్తుంటాను. ఆర్ట్ వేసిన తర్వాత పనీర్ని పడేయకుండా... దాంతో పనీర్ పకోడీ చేశాను” అంటున్నాడు ఈ ఫుడ్ ఆర్టిస్ట్.