
- కార్పొరేట్ కాలేజీలను కట్టడి చేయలేదు
- తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్ మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరీ సతీశ్
ముషీరాబాద్, వెలుగు : కార్పొరేట్ కాలేజీలను కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే అసోసియేషన్ ఏర్పడిందని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరీ సతీష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల పరిరక్షణ ధ్యేయంగా అసోసియేషన్ పని చేస్తుందని స్పష్టం చేశారు. మంగళవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడిగా గౌరీ సతీశ్, ప్రధాన కార్యదర్శిగా విష్ణువర్ధన్ రెడ్డిని కొత్త అసోసియేషన్ కమిటీని ఎన్నుకున్నారు.
అనంతరం గౌరీ సతీశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రైవేటు కాలేజీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రైవేటు కాలేజీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జీవో నంబర్ 102 ప్రకారం పెంచాల్సిన ట్యూషన్ ఫీజు 10 శాతం గత ప్రభుత్వం పెంచలేదని కొత్తగా వచ్చిన ప్రజా ప్రభుత్వం ఆ జీవోను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రెండేండ్లుగా రాష్ట్రంలో పేరుకుపోయిన ట్యూషన్ ఫీజు, మెస్ చార్జీలు, స్కాలర్షిప్లపై సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని విడుదల చేయాలని కోరారు. ఎన్నికల అధికారులుగా వరదారెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రావణ్ కుమార్, అప్సర్ పాషా సమక్షంలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.