
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు షేర్ల విలువను అక్రమంగా పెంచారని, సంస్థ మనీలాండరింగ్ పాల్పడిందంటూ అమెరికా షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ ఐదు నెలల క్రితం ఇచ్చిన రిపోర్ట్పై సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే తమ కంపెనీలపై దాడి చేశారని ఆరోపించారు. తమ కంపెనీల్లో పాలనా వ్యవహారాలు సక్రమంగా ఉన్నాయని, రూల్స్ను పాటిస్తున్నామని స్పష్టం చేశారు. తాము రెగ్యులేటరీ రూల్స్ను పాటించలేదన్న ఆరోపణల్లో నిజం లేదని సుప్రీంకోర్టు నియమిత కమిటీ కూడా స్పష్టం చేసిందని ఈ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వార్షిక నివేదికలో ఆయన పేర్కొన్నారు. ‘రిపబ్లిక్ డే’ జరుగుతున్నప్పుడే రిపోర్ట్బయటికి వచ్చిందని అన్నారు. హిండెన్బర్గ్ అదానీ గ్రూప్పై చాలా ఆరోపణలు చేయడంతో సంస్థ కంపెనీల షేర్ల విలువ 150 బిలియన్ డాలర్ల వరకు తగ్గింది. ‘అత్యంత సంపన్న భారతీయుడు’ అనే రికార్డు కూడా పోయింది. ‘‘రిపోర్ట్ అంతా తప్పుల తడక. అందులో ఇచ్చినది తప్పుడు సమాచారం. పాత వివరాలు ఇచ్చారు. మా ప్రతిష్టను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగింది. రిపోర్ట్ వల్ల మేం చాలా నష్టపోవాల్సి వచ్చింది. ఆరోపణలు తప్పని నిరూపించగల వివరాలన్నీ మేం ఇచ్చాం. హిండెన్బర్గ్రిపోర్ట్నుంచి అక్రమంగా ప్రయోజనం పొందడానికి కొన్ని స్వార్థశక్తులు ప్రయత్నించాయి. పలు న్యూస్ చానెల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేశాయి. తమవైపు నుంచి ఒక్కతప్పు కూడా జరిగినట్టు సుప్రీంకోర్టు కమిటీ గుర్తించలేకపోయింది. ఇండియా మార్కెట్లను అస్థిరపర్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ ఘటనపై సెబీ సుప్రీంకోర్టుకు ఇంకా రిపోర్ట్ఇవ్వలేదు. మా గవ ర్నెన్స్, డిస్క్లోజర్ స్టాండర్డ్స్ గురించి మాకు పూర్తిగా నమ్మకం ఉంది”అని అదానీ వివరించారు.
దాని గురించి తెలియదు...
హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల గురించి వివరణ ఇవ్వాల్సిందిగా తమ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన అతిపెద్ద యూఎస్ ఇన్వెస్టర్లను అక్కడి అధికారులు అడిగారంటూ వచ్చిన సమాచారం గురించి తమకు తెలియదని అదానీ గ్రూపు ఈ సందర్భంగా వివరణ ఇచ్చింది. కంపెనీ డిస్క్లోజర్స్ సరిగ్గా ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే రెగ్యులేటర్లు ఇన్వెస్టర్లను ఇలాంటి వివరాలను అడగటం అసాధారణ ఏమీ కాదని వివరించింది. తాము ఎన్నడూ అకౌంటింగ్ స్టాండర్డ్స్ను ఉల్లంఘించలేదని, అన్ని రూల్స్ను తూచ తప్పకుండా పాటించామని స్పష్టం చేసింది. ఈ వార్తల కారణంగా అదానీ గ్రూప్ షేర్లు మరోసారి తీవ్రంగా నష్టపోయాయి. ఇదిలా ఉంటే, హిండెన్బర్గ్ రిపోర్ట్ తరువాత అదానీ గ్రూపు తీసుకున్న చర్యల వల్ల ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగిందని సుప్రీంకోర్టు కోర్టు కమిటీ పేర్కొంది. పలు అప్పులను ముందే తీర్చడం, పెట్టుబడులను పెంచడం వల్ల సంస్థకు మేలు జరిగిందని కామెంట్ చేసింది. ‘‘ఆరోపణలకు సంబంధించి సెబీ అడిగిన అన్ని వివరాలనూ అదానీ గ్రూప్ ఇస్తోంది. సెబీ విచారణ జరుగుతున్న సమయంలో అదానీ గ్రూపునకు సంబంధించి ఎవరూ విమర్శలు చేయకూడదు. సెబీ, సుప్రీంకోర్టు నిర్ణయాల కోసం చూడాలి”అని కమిటీ అభిప్రాయపడింది.