
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ ఎంటర్ప్రైజ్ 5జీ సేవలు మొదలుపెట్టడంతోపాటు కన్జూమర్యాప్లను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. కస్టమర్ల కోసం బీ2సీ యాప్లను తీసుకురానుంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ మాదిరిగా సాధారణ కస్టమర్లకు టెలికం సేవలు అందించే ఉద్దేశం లేదని అదానీ కిందటి ఏడాది 5జీ వేలం సమయంలోనే ప్రకటించారు. కన్జూమర్ మొబిలిటీ రంగంలోకి రాబోమని స్పష్టం చేశారు. అదానీ తన వ్యాపారాన్ని దేశం వెలుపల కూడా విస్తరించాలని చూస్తున్నందున, ఈ గ్రూపు ఏఐ,ఎంఎల్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్& మెషిన్ లెర్నింగ్), ఎంటర్ప్రైజెస్ క్లౌడ్ సామర్థ్యాలను నిర్మించడం, డేటా సెంటర్లను విస్తరించడంపై దృష్టి పెడుతోంది. విదేశీ మార్కెట్లలో అడుగుపెట్టడానికి ఇదే అనువైన సమయమని ఉద్యోగులను ఉద్దేశించి ఇటీవల మాట్లాడుతూ అదానీ వెల్లడించారు. 2023లో డేటా సెంటర్లను విస్తరించడం ద్వారా కంపెనీ డిజిటల్ వైపు దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు.
ఏఐ,ఎంఎల్, ఇండస్ట్రియల్ క్లౌడ్ సామర్థ్యాలను సాధించడం వల్ల కోట్ల మంది కస్టమర్లను డిజిటల్ ప్రయాణంలోకి తీసుకురావొచ్చని అన్నారు. ఇందుకోసం ఎంటర్ప్రైజ్ 5జీ సేవలు, బీ2సీ యాప్లను విడుదల చేస్తామని చెప్పారు. అహ్మదాబాద్కు చెందిన సిమెంట్- టు- కన్స్యూమర్ గూడ్స్ మేకర్ అయిన అదానీ గ్రూపు 70 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ వాల్యూ చైన్ను నిర్మిస్తోంది. రాబోయే 10 సంవత్సరాలలో తన టార్గెట్ చేరుకోవాలని కోరుకుంటోంది. దేశంలో పెట్రోకెమికల్స్, ఎరువులు, సిమెంట్, స్టీల్ కోసం డౌన్స్ట్రీమ్ అప్లికేషన్లను తెస్తామని అదానీ చెప్పారు. 20వ శతాబ్దంలో ప్రపంచ వృద్ధికి వెన్నెముక చమురు అని, 21వ శతాబ్దంలో అభివృద్ధికి గ్రీన్ ఎలక్ట్రాన్లు కీలకమని అన్నారు. చౌకైన గ్రీన్ ఎలక్ట్రాన్లను భారీగా ఉత్పత్తి చేసే దేశాలు రాబోయే కాలంలో చాలా అభివృద్ధిని సాధిస్తాయని, చాలా తక్కువ కంపెనీలు మాత్రమే అదానీస్థాయిలో ఉన్నాయని వివరించారు.