మెగాస్టార్ మూవీతో జెనీలియా కమ్ బ్యాక్ ఇవ్వనుందా?

మెగాస్టార్ మూవీతో జెనీలియా కమ్ బ్యాక్ ఇవ్వనుందా?

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించనున్న నెక్స్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా జెనీలియా దేశ్ ముఖ్ నటించనుందన్న వార్త ఆసక్తి రేపుతోంది. సుమారు దశాబ్దం పాటు తెలుగు ఆడియన్స్ ను చిలిపి నటనతో ఆకట్టుకుంది జెనీలియా. అయితే తొమ్మిదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆమె చిరంజీవి నెక్స్ట్ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వనుందని పుకార్లు వస్తున్నాయి. మోహన్ లాల్ నటించిన మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ లూసిఫర్ రీమేక్ లో చిరంజీవి యాక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో చిరు సోదరి పాత్రను జెనీలియా పోషించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో నటించడానికి జెనీలియా ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే దీనిపై మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మాతగా, సాహో ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో లూసిఫర్ తెలుగు రీమేక్ తెరకెక్కనుంది. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక.. తన తదుపరి ప్రాజెక్ట్ వివరాలను చిరు వెల్లడించే అవకాశం ఉంది.

2003లో శంకర్ డైరెక్షన్ లో వచ్చిన బాయ్స్ చిత్రంతో తమిళ, తెలుగు ప్రేక్షకులకు జెనీలియా పరిచయమైంది. ఆ సినిమాలో హరిణి పాత్రతో ఆడియన్స్ కు దగ్గరైంది. ఆ తర్వాత సత్యం, సాంబ, నా అల్లుడు సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక, 2006లో వచ్చిన బొమ్మరిల్లు సినిమాతో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు, పలు అవార్డులనూ సాధించింది. బొమ్మరిల్లులో నటనకు గానూ తెలుగు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటితోపాటు నంది స్పెషల్ జ్యూరీ అవార్డునూ జెనీలియా సొంతం చేసుకుంది. చివరగా 2012లో నా ఇష్టం సినిమాలో నటించిన జెనీలియా.. బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకొన్న తర్వాత నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది.