కడసారైనా కన్నబిడ్డను చూసుకోలేకపోయాం

కడసారైనా కన్నబిడ్డను చూసుకోలేకపోయాం
  • శోకసంద్రంలో సహజా రెడ్డి తల్లిదండ్రులు
  • అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఘట్​కేసర్ యువతి మృతి
  • కూకట్​పల్లి యువకుడు కూడా..

ఘట్​కేసర్, వెలుగు: అమెరికాలోని బర్మింగ్​హామ్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా చౌదరిగూడకు చెందిన ఉడుముల సహజా రెడ్డి (24) మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కడసారైనా కన్నబిడ్డను చూసుకోలేకపోయామని సహజ తల్లిదండ్రులు జయాకర్ రెడ్డి, శైలజ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనను చూసిన బంధువుల, స్థానికులు చలించిపోయారు. జయాకర్ రెడ్డి టీసీఎస్​లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, శైలజ ప్రభుత్వ టీచర్. జనగామ జిల్లాకు చెందిన వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఘట్​కేసర్​మండలం చౌదరిగూడలోని శ్రీనివాస్​నగర్​కాలనీలో స్థిరపడ్డారు. చిన్న కుమార్తె ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్​లోనే బీబీఎస్ కోసం ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుంటోంది. 

పెద్ద కుమార్తె సహజారెడ్డి 2021లో ఎంఎస్ చదువు కోసం అమెరికాలోని బర్మింగ్​హామ్​కు వెళ్లింది. బర్మింగ్ హామ్​లో సహజారెడ్డి, కూకట్​పల్లికి చెందిన అన్వేశ్, మరో ఇద్దరు స్నేహితులు కలిసి ఉంటున్నారు. గురువారం రాత్రి వీరి అపార్ట్​మెంట్ పక్కనున్న మరో భవనం నుంచి భారీగా మంటలు రావడంతో వేగంగా వ్యాపించాయి. ప్రమాదవశాత్తు సహజారెడ్డి ఉంటున్న ఇంటికి మంటలు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకొని సహజా రెడ్డి, అన్వేశ్​మృతి చెందగా, మరో ఇద్దరు తప్పించుకున్నారు. కూతురు మరణవార్త విన్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తన కూతురు రోజూ వీడియో కాల్ చేసి మాట్లాడుతుండేదని. ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఉప్పొంగి పోయేవాళ్లమని వాపోయారు. వచ్చే వారం సహజారెడ్డి డెడ్​బాడీ స్వగ్రామానికి రానున్నట్లు బంధువులు తెలిపారు.