
గ్రేటర్ ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను సరిచేయాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు బీజేపీ నేత చింతల రామచంద్రరావు. బీజేపీకి అనుకూలమైన ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించిన విషయాన్ని ఎస్ఈసీకి తెలిపామన్నారు. కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహింవాలని కోరామన్నారు. స్థానిక అధికారులను ప్రిసైండింగ్ అధికారులుగా నియమించవద్దని కోరామన్నారు. కేంద్ర, ఇతర జిల్లాల అధికారులతో మాత్రమే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని కోరినట్టు చెప్పారు. దుబ్బాకలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను గ్రేటర్ ఎన్నికలకు దూరంగా పెట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు చింతల రామచంద్రారెడ్డి తెలిపారు.
GHMC ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. అంతేకాదు నామినేషన్ రోజు నుంచే లిక్కర్ షాపులను బంద్ చేయాలని డిమాండ్ చేశారు. పక్క డివిజన్లకు చెందిన ఐదారు వేల ఓట్లు అటు ఇటు మార్చారని ఎన్నికల సంఘానికి తెలిపారు. ఇతర ప్రాంతాల పోలీస్ అధికారులను మాత్రమే ఎన్నికల్లో నియమించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్లపై తమకు నమ్మకం లేదన్నారు. హౌస్ నంబర్లు ఇవ్వటంలో మున్సిపల్ శాఖ విఫలమైందన్నారు. అక్రమ కట్టడాల నివాసాలకు ఇంటి నంబర్లు ఇవ్వకపోవటంతో ఓటర్ లిస్టులో అవకతవకలు జరుగుతున్నాయని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు.