
- నేటి నుంచి వానాకాలం ముగిసే వరకు..
- శిథిలావస్థ భవానాల్లో ఏదైనా జరిగితే అధికారులదే బాధ్యత
- బల్దియా కమిషనర్ కర్ణన్ స్పష్టం
హైదరాబాద్ సిటీ, వెలుగు: శిథిలావస్థలో ఉన్న భవనాల్లో అనుకోని సంఘటన జరిగితే ఆ ఏరియా అధికారిపై చర్యలు తప్పవని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు. గురువారం శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, సెల్లార్ నిర్మాణాలపై కమిషనర్ తన చాంబర్ నుంచి జోనల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రేటర్ లో 428 ఇండ్లు శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించామని, అందులో 131 ఇండ్ల రిపేర్లకు అవకాశం ఉందన్నారు. మిగతా 297 నిర్మాణాలకు నోటీసులు జారీ చేశామన్నారు.
శిథిలావస్థలో ఉన్న ఇండ్లల్లో ఉండే వారికి అవగాహన కల్పించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆ ఇండ్లను సీజ్ చేయాలన్నారు. చుట్టూ ఉన్న వారిని కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పాలన్నారు. శుక్రవారం నుంచి వర్షాకాలం ముగిసే వరకు గ్రేటర్ లో కొత్త సెల్లార్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదని ఆదేశించారు. ఇప్పటికే నిర్మించిన సెల్లార్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
సెల్లార్లలో నీరు నిల్వకుండా సైట్లో యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు. జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, హేమంత్ కేశవ్ పాటిల్, అపూర్వ చౌహాన్, రవి కిరణ్, వెంకన్న తో పాటుగా హెడ్ ఆఫీస్ టౌన్ ప్లానింగ్ సీసీపీ శ్రీనివాస్, అడిషనల్ సీసీపీ గంగాధర్, వెంకన్న,జోనల్ టౌన్ ప్లానింగ్, సర్కిల్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.