అవినీతిలో టౌన్​ప్లానింగ్ .. పైసలిస్తే ఎవరికైనా పర్మిషన్

అవినీతిలో టౌన్​ప్లానింగ్ .. పైసలిస్తే ఎవరికైనా పర్మిషన్
  • బల్దియా కౌన్సిల్​ మీటింగులో సభ్యుల ఫైర్​
  • నోటరీ ఇండ్లకు పర్మిషన్ ​ఇవ్వనప్పుడు ఎలా కూలుస్తారని ఆగ్రహం  
  • స్ట్రీట్​ లైట్లపై గళమెత్తిన సభ్యులు 
  • ఫేక్ బర్త్,​ డెత్ ​సర్టిఫికెట్ల వ్యవహారంపై మండిపాటు 
  • స్పోర్ట్స్ విభాగం నిర్వీర్యమైందని, పూడిక తీయడం లేదని లొల్లి   

హైదరాబాద్ సిటీ, వెలుగు: ‘టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులిస్తే ఎవరికైనా అనుమతులిస్తున్నారని, ఒక సర్వే నంబర్​తో అనుమతులు తీసుకొని మరో చోట నిర్మిస్తున్నా సదరు అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదు’ అని  కౌన్సిల్ సమావేశంలో సభ్యులు మండిపడ్డారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్​లో బుధవారం నిర్వహించిన ఈ సమావేశం ఉదయం 10.47 గంటలకు  ప్రారంభమై 7 గంటలకు ముగిసింది. ముందుగా పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారితో పాటు గుల్జార్ హౌస్ ఫైర్ యాక్సిడెంట్​లో చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. 

ఈ సందర్భంగా స్పోర్ట్స్, స్ట్రీట్ లైట్లు, టౌన్ ప్లానింగ్, యూబీడీ, హెల్త్, మెయింటెనెన్స్, నాలా, అడ్వటైజ్ మెంట్లకు సంబంధించి 8 ప్రశ్నలపై చర్చ జరిగింది. కౌన్సిల్ పదవీకాలం పూర్తయ్యే దశకు చేరుకుందని, ప్రతి సమావేశంలో కౌన్సిల్ ముందుకు తీసుకొస్తున్న సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఒకే ప్రశ్నను ఏండ్లుగా అడగాల్సి వస్తోందని కార్పొరేటర్లు మండిపడ్డారు. మీటింగ్​ ప్రారంభానికి ముందు గ్రేటర్ లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయంటూ బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు విడివిడిగా ఆఫీసు ముందు ఆందోళన నిర్వహించారు. 

పేదల ఇండ్లు కూల్చేస్తున్నరు

బడా బాబులు నిర్మించే అక్రమ నిర్మాణాలను పట్టించుకోని టౌన్​ ప్లానింగ్​ శాఖాధికారులు పేదలు కట్టుకుంటున్న ఇండ్లను సీజ్ చేస్తున్నారని, కూలుస్తున్నారని సభ్యులు ఫైరయ్యారు. -బన్సీలాల్​పేట కార్పొరేటర్​హేమలత మాట్లాడుతూ.. నోటరీ ప్లాట్లు ఉన్నవారికి ఇండ్ల అనుమతులు ఇవ్వాలని, వారు ఇండ్లు కట్టుకున్నప్పుడు స్పందించకుండా, తర్వాత ఎప్పుడో వెళ్లి కూల్చడమేమిటని ప్రశ్నించారు. -అనుమతులు ఇవ్వనప్పుడు ఆ ఇండ్లను కూల్చే అధికారం ఎక్కడిదని ఫైరయ్యారు. 

పన్ను కట్టించుకుంటూనే ఎలా కూలుస్తారన్నారు. వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదిప్యా మాట్లాడుతూ బోరబండలో అక్రమ నిర్మాణమని బీఆర్ఎస్​లీడర్ ఇంటిని సీజ్ చేశారని, దీనివెనుక ఓ కార్పొరేటర్ ఉన్నారని, అధికారుల నిర్లక్ష్యంతో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. లైట్ల సమస్య తీరేదెన్నడు 
స్ట్రీట్ లైట్ల సమస్యపై సభ్యులు ఫైరయ్యారు. ఎంఐఎం కార్పొరేటర్ సలీంబేగ్ మాట్లాడుతూ ఈఈఎస్ ఎల్ సంస్థ టెండర్లు గతనెలలో ముగిశాయని, గడువు ముగిసే ముందు కొత్త టెండర్లు పిలిస్తే ఇప్పుడు ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. 

పైసలిస్తే బర్త్ సర్టిఫికెట్లు..

బర్త్, డెత్​సర్టిఫికెట్ల వ్యవహారంలో బల్దియాలో కేవలం కింది స్థాయి సిబ్బందిని మాత్రమే తొలగించారని, అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మన్సురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి ఫైరయ్యారు. గతంలో 25 వేల ఫేక్ సర్టిఫికెట్లు గుర్తించారని, వీటి ద్వారా ఎంతోమంది దేశం దాటారన్నారు. రోహింగ్యాలకు కూడా సర్టిఫికెట్లు అందుతున్నాయని ఆరోపించారు. అన్ని సరిగ్గా ఉంటే రూ.3 వేలు, లేకపోతే రూ.30 వేలు ఇస్తే సర్టిఫికెట్లు ఇస్తున్నారన్నారు.   

చెత్త తీయకపోతే జోన్ ఆఫీసుల ముందు వేస్తం

రాంకీకి బిల్లులు ఇవ్వకపోవడంతో 25 టన్నుల వాహనాలను నిలిపేసినట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిపై క్లారిటీ ఇవ్వాలని కమిషనర్ ను నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్​ కోరారు. బక్రీద్ ముందు రాంకీ ఈ నిర్ణయం తీసుకోవడం మంచిదికాదన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలన్నారు. చెత్త తరలించకపోతే జోనల్ ఆఫీసుల ముందు తీసుకువచ్చి పోస్తామన్నారు.  

వివిధ అంశాలపై చర్చ 

బల్దియా స్పోర్ట్ విభాగం నిర్వీర్యమైందని, అసలు స్పోర్ట్స్ కాంప్లెక్సులు నిర్మించినా అందులో మెటీరియల్​లేదని, చాలా చోట్ల కోచ్​లు లేరని సభ్యులు మండిపడ్డారు. తొందర్లోనే సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ ఆర్వీ కర్ణన్ సమాధానం ఇచ్చారు.  అలాగే వర్షాకాలం వచ్చినా నాలాల్లో పూడిక తీయకపోవడంపై కార్పొరేటర్లు మండిపడ్డారు. ఇదే విషయంపై మేయర్ కూడా ఫైరయ్యారు. నగరంలో ఎక్కడ చూసినా రోడ్లను తవ్వతున్నారని, తర్వాత వేయడంలేదని, ఇలాంటి వారిపై యాక్షన్​తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అడ్వర్టైజ్​ మెంట్​ఆదాయంపై చంపాపేట కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ బల్దియాలో ప్రకటనల ద్వారా సరైన ఆదాయం రావడం లేదన్నార. గతంలో అడ్వర్టైజ్​మెంట్​పై కమిటీ వేశారని, 10 రోజులు వెయిట్ చేస్తామని, యాక్షన్ తీసుకోకపోతే కోర్టుని ఆశ్రయిస్తామన్నారు. 

సర్దార్ ​మరణంపై రచ్చ

సమావేశం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ కార్పొరేటర్లు.. బోరబండ కార్పొరేటర్​ బాబా ఫసియుద్దీన్​కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని ఉరి తీయాలంటూ నిరసన తెలిపారు. బోరబండ పరిధిలో సర్దార్ మరణానికి ఫసియుద్దీనే కారణమని ఆరోపించారు. దీనిపై మేయర్ స్పందిస్తూ ఆ విషయాన్ని పోలీసులు చూసుకుంటారని, సభలో ఇలాంటి నినాదాలు సరికాదన్నారు. ఈ అంశంపై అడ్వకేట్ అయిన ఎంపీ రఘునందన్ రావు మాట్లాడతారని చెప్పగా, రఘునందరావు స్పందిస్తూ ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన ఉరి తీయాల్సిన అవసరం లేదన్నారు. 

ఎమ్మెల్యే మాగంటి కుట్ర 

సర్దార్ చావుకు తాను కారణమంటూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తనపై కుట్ర చేశాడని ఫసియుద్దీన్ అన్నారు. సర్దార్​చనిపోయాడని తెలియగానే వెళ్లాలనుకున్నానని, కానీ, తనను చంపేస్తామని స్లొగన్స్ చేశారని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని పోలీసులు శవయాత్రకు రానివ్వలేదన్నారు. సర్దార్ ప్రమాదవశాత్తు చనిపోయాడని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారని, కానీ సూసైడ్ చేసుకున్నాడని మాగంటి అసత్య ప్రచారం చేశాడన్నారు. తనపై, తన ఇంటిపై మాగంటి దాడి చేయించడానికి ప్రయత్నించాడని, తనపై దాడి చేయాలని సోషల్ మీడియా లో పోస్టులు పెట్టించారన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై నగర కమీషనర్ కి కంప్లెయింట్ చేస్తానన్నారు.