
ప్రధాని మోదీని కోరనున్న రాష్ట్ర బీజేపీ ఎంపీలు
హైదరాబాద్, వెలుగు: 1969 తెలంగాణ ఉద్యమకారుల స్మృతివనానికి కంటోన్మెంట్ ఏరియాలో వంద ఎకరాలు కేటాయించాలని బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, నగేశ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అర్వింద్, ఈటల రాజేందర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో కలిసి ఈ నెల 23న పార్లమెంట్లో మోదీకి లెటర్లను అందజేయనున్నట్టు ఉద్యమకారుల సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిషన్ రావు, సుదర్శన్ రావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గతేడాది రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాజ్నాథ్ సింగ్, ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డా స్మృతి వనం ఏర్పాటుకు హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి 250 గజాల జాగా, నెలకు రూ.25వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీ ఉందని గుర్తు చేశారు. 1969 ఉద్యమకారులు 300 మందిలోపే ఉన్నారని తెలిపారు.