
- ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్ ఇవ్వాలి
- బెంగాల్ సర్కారుకు కలకత్తా హైకోర్టు ఆదేశం
కోల్కతా: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని శాఖలకు సంబంధించిన సర్కారీ కొలువుల్లో వాళ్లకు 1 శాతం రిజర్వేషన్ కేటాయించాలంటూ బెంగాల్ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) 2014, 2022లో క్వాలిఫై అయినప్పటికీ తనను ఇంటర్వ్యూకు ఎంపిక చేయలేదని ఓ ట్రాన్స్జెండర్ వేసిన పిటిషన్పై కోర్టు ఇటీవల విచారించింది.
లింగమార్పిడి చేసుకున్నోళ్లను థర్డ్ జెండర్గా గుర్తించాలని, విద్యాసంస్థల్లో ప్రవేశాలు, నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలని 2014లోనే సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించిందని హైకోర్టు గుర్తు చేసింది. ట్రాన్స్జెండర్లు సమాన ఉపాధి అవకాశాలకు అర్హులేనని 2022లో రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు బెంగాల్ ప్రభుత్వ తరఫు అడ్వొకేట్ కోర్టుకు తెలిపారు. దీంతో సమాన అవకాశాలతో పాటు ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కూడా కల్పించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ను ఇంటర్వ్యూకు ఎంపిక చేయాలని విద్యాశాఖను ఆదేశించింది.