- ఈ విషయాన్ని ఇదివరకే చెప్పిన: గోరటి వెంకన్న
- కోదండరాం ఇంటి తలుపులు పగలగొట్టారు, హరగోపాల్పై కేసు పెట్టారు
- నెహ్రూ వారసులారా.. మీరు తప్పు చేయవద్దంటూ కాంగ్రెస్కు సూచన
హైదరాబాద్, వెలుగు : పది ఎకరాలకు మించి భూమి ఉన్న వాళ్లకు రైతుబంధు ఇవ్వవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. శనివారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. వందల ఎకరాలు ఉన్న హీరోలు, హీరోయిన్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, నాయకులకు రైతుబంధు వద్దని తాను ఇది వరకే చెప్పానని, అదే విషయాన్ని ఇప్పుడూ చెబుతున్నానని అన్నారు. పేదలకు నీళ్లు, రైతుబంధు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్దే అని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్రతిష్ఠ పాలుకావడానికి అధికారులే కారణమని ఆరోపించారు. అధికారులు ఇష్టారీతిగా వ్యవహరించి కోదండరాం ఇంటి తలుపులు పగలగొట్టారని, హరగోపాల్ మీద కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు నెహ్రూ, కేసీఆర్, సోనియా గాంధీ అని చెప్పుకొచ్చారు. ‘నెహ్రూ వారసులారా.. మీరు తప్పు చేయవద్దు’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.