వారసత్వంతో ప్రపంచ అభివృద్ధి: ప్రధాని మోదీ

వారసత్వంతో ప్రపంచ అభివృద్ధి: ప్రధాని మోదీ

    చరిత్రను అందరూగౌరవించాలి: మోదీ
    యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్​ను ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీ: వారసత్వం అనేది చరిత్ర మాత్రమే కాదని.. మానవతా విలువలను పంచుకోవడం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వారసత్వ సంపదను ప్రపంచ అభివృద్ధికి, మనసులను అనుసంధానించడానికి ఉపయోగించాలని ప్రజలకు సూచించారు. వార‌స‌త్వ కట్టడాల పరిరక్షణే ధ్యేయంగా ప‌నిచేసే యునెస్కో ప్రపంచ వార‌స‌త్వ క‌మిటీ 46వ సెష‌న్ ను ఢిల్లీలోని భారత్ మండపంలో ఆదివారం మోదీ ప్రారంభించారు. ఈ నెల 31 వ‌ర‌కు సమావేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. హిస్టారికల్ ప్లేసులు చూసినప్పుడల్లా.. ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా ఉంటారన్నారు. 


ప్రతి ఒక్కరు చరిత్రను గౌరవించాలని సూచించారు. పురాతన కళాఖండాలు తిరిగి ఇండియాకు వస్తుండటం.. ప్రపంచ ఉదారవాద, చరిత్రపట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందని అన్నారు. ఇండియా వారసత్వం అనేది ఒక చరిత్ర మాత్రమే కాదని.. సైన్స్ అని తెలిపారు. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన జీవన నాగరికతలో ఇండియాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రతి ఒక్కరి వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఇదొక మంచి వేదిక​అని మోదీ అభిప్రాయపడ్డారు. మానవ సంక్షేమ స్ఫూర్తిని పెంపొందించవచ్చని తెలిపారు. అలాగే టూరిజం రంగాన్ని కూడా ఎంతో డెవలప్​చేసుకోవచ్చన్నారు. దీంతో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ మీటింగ్​కు 150కి పైగా దేశాల నుంచి 2వేల‌ మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు హాజ‌ర‌య్యారు.