హైదరాబాద్, వెలుగు: అమెరికా రాజధాని వాషింగ్టన్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఎర్ర సత్యనారాయణ సమక్షంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రవాస తెలంగాణవాదులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ.. సామాజిక న్యాయ రాజ్యాధికార ఆఖరి పోరాటానికి తెలంగాణ వాదులు, ప్రవాస తెలంగాణ ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్ర బిందువుగా నిలిచిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాకారంలో తొలి, -మలి దశ ఉద్యమాల్లో విద్యార్థుల పాత్రే ప్రధానమైందన్నారు. కార్యక్రమంలో గాజుల బుచ్చన్న, పవన్ గిర్ల, కాంచెట్టి రమణ, రవి పులి, రమేష్ చంద్ర రెడ్డి, వేముల సత్యం, కౌశల్ ఎర్ర తదితరులు పాల్గొన్నారు.