హైదరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావన సందర్భంగా జీవో 97 ప్రతులను చించివేసి నిరసన తెలిపారు. ఈ జీవోతో రాష్ట్రంలోని దాదాపు లక్ష మంది పేద, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆయన.. బహుళ అంచెల సాంకేతిక విద్యా వ్యవస్థను నాశనం చేయడం సరికాదన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలను అణచివేసేందుకు లాఠీచార్జీలు, నిర్బంధాలకు పాల్పడటం తగదన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరణ వైపు మళ్లించి, వాటి విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు.
