హైకోర్టులోనే తేల్చుకోండి: జన నాయగన్ సినిమాకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ

హైకోర్టులోనే తేల్చుకోండి: జన నాయగన్ సినిమాకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ

న్యూఢిల్లీ: విజయ్ దళపతి నటించిన జన నాయగన్ మూవీకి సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. ఈ సినిమా రిలీజ్ వ్యవహరంలో జోక్యం చేసుకునేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. జన నాయగన్ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేలా సీబీఎఫ్‎సీకి ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అంగీకరించలేదు. మద్రాస్ హైకోర్ట్‎ డివిజన్ బెంచ్‎లోనే తేల్చుకోవాలని మూవీ యూనిట్‎కు సూచించింది. 2026, జనవరి 20వ తేదీలోగా పిటిషన్‎పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్‏పై విచారణ పూర్తి అయ్యే వరకు సర్టిఫికెట్‌ను నిలిపివేయాలని సీబీఎఫ్‎సీని ఆదేశించింది.

వివాదం ఏంటంటే..?

దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం జన నాయగన్. సంక్రాంతి పండగను పురస్కరించుకుని 2026, జనవరి 9వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. పాలిటిక్స్‎లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఇదే తన చివరి సినిమా అని విజయ్ ప్రకటించడంతో జన నాయగన్ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఈ క్రమంలో జన నాయగన్ సినిమాపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సెన్సార్ సర్టిఫికెట్‌ జారీ చేయలేదు.

దీంతో జనవరి 9న విడుదల కావాల్సిన జన నాయగన్ విడుదల వాయిదా పడింది. సీబీఎఫ్‎సీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ మూవీ నిర్మాత మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్.. జన నాయగన్ మూవీకి U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని సీబీఎఫ్‎సీని ఆదేశించింది. అయితే..  సింగిల్ బెంచ్ తీర్పును సెన్సార్ బోర్డు హైకోర్టు డివిజన్ బెంచ్‌‎లో ఛాలెంజ్ చేసింది.

Also Read  :కొత్త మలుపు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

జన నాయగన్ మూవీకి U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. అనంతరం ఈ కేసు విచారణను 2026, జనవరి 21కి వాయిదా వేసింది. ఈ క్రమంలో డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ జన నాయగన్ మూవీ నిర్మాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

గురువారం (జనవరి 15) ఈ పిటిషన్‎పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జన నాయగన్ మూవీ విడుదల విషయంలో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‎లోనే తేల్చుకోవాలని మూవీ యూనిట్‎ను ఆదేశించింది. 2026, జనవరి 20వ తేదీలోగా పిటిషన్‎పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది సుప్రీంకోర్టు.