వీకెండ్ టూర్​ కోసం ఈ నేషనల్​ పార్కులకి వెళ్లొచ్చు

వీకెండ్ టూర్​ కోసం ఈ నేషనల్​ పార్కులకి వెళ్లొచ్చు

రంగురంగుల పక్షులు, వాటి రాగాలు ఎవరికైనా ఇష్టమే. అలాగే చెట్టూ చేమని పలకరిస్తూ, ప్రకృతి ఒడిలో సేదతీరాలని అనుకుంటారు చాలా మంది. అందుకే వీకెండ్​ లేదా హాలిడే అయితే చాలు.. పచ్చని చెట్ల మధ్యలో నడిచేందుకు రెడీ అయిపోతారు. అలాంటివాళ్లు పెద్ద పార్క్​లకి ఫస్ట్​ ప్రిఫరెన్స్​ ఇస్తారు. ఎందుకంటే... ఇక్కడికి వెళ్తే చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఎంజాయ్​ చేయొచ్చు. మన హైదరాబాద్​ చుట్టుపక్కల కూడా అలాంటి పార్కులు ఉన్నాయి. ఈసారి వీకెండ్ టూర్​ కోసం ఈ నేషనల్​ పార్కులకి వెళ్లొచ్చు. వాటిలో రెండింటి గురించి..

మహావీర్​ హరిణ వనస్థలి నేషనల్​ పార్క్... హైదరాబాద్​లోని వనస్థలిపురంలో ఉంది. ఇక్కడ జింకలతో పాటు రకరకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. పచ్చని చెట్ల మధ్య నడుస్తూ, పక్షుల పలకరింపులు వింటూ గడపాలనుకునేవాళ్లకు ఈ ప్లేస్​ పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ పార్క్​ని1975లో  ఏర్పాటు చేశారు. జైన గురువు మహావీరుడి 2,500 జయంతి సందర్బంగా ఈ పార్క్​ పేరుని ‘మహవీర్​ హరిణ వనస్థలి నేషనల్​ పార్క్’గా మార్చారు. ​15 ఎకరాల్లో ఉంది ఈ పార్క్. అంతరించిపోయే దశలో ఉన్న కృష్ణ జింకల్ని ఇక్కడ చూడొచ్చు. ముళ్ల పందులు, అడవి పందులతో పాటు నెమళ్లు, కింగ్​ఫిషర్, కైట్​ వంటి పక్షులు కనిపిస్తాయి. రకరకాల పక్షుల్ని చూస్తూ, వాటి సవ్వడులు వింటుంటే పొద్దే తెలియదు. అంతేకాదు ఈ పార్క్​ 8 రకాల వలస పక్షులకి ఆవాసం కూడా.  ఎత్తైన ప్రాంతం నుంచి జంతువుల్ని, పక్షుల్ని చూసేందుకు వీలుగా షెడ్స్​, టవర్స్​ వంటివి ఉంటాయి. ఈ పార్క్​లోని జంతువులు, పక్షుల ఫొటోల్ని ఎగ్జిబిషన్​ హాల్లో చూడొచ్చు. 
ఇలా వెళ్లాలి
ఈ పార్క్​ హైదరాబాద్ – విజయవాడ రోడ్డులో ఉంది​. హైదరాబాద్​​ నుంచి 15 కి.మీటర్ల జర్నీ. 
టైమింగ్స్​: ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 వరకు. ప్రతి సోమవారం సెలవు. 
టికెట్:  పిల్లలకు రూ.15, పెద్దలకు 20 రూపాయలు. 

మచ్చల జింకలకి ఫేమస్​
మృగవని నేషనల్​ పార్క్​... రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిల్కూర్​ గ్రామంలో ఉంది.  కొండలు, డ్రై ఫారెస్ట్​ ఉండే ఈ ప్రాంతం దక్కన్​ పీఠభూమి వాతావరణాన్ని తలపిస్తుంది. ఈ పార్క్​ని 1994లో వైల్డ్​లైఫ్​ శాంక్చురీగా మార్చారు. 850 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్​లో 600లకు పైగా జంతువులు, రకరకాల చెట్లు ఉన్నాయి. మచ్చల జింక, కృష్ణజింక, అడవిపంది, నల్ల రంగు మెడ ఉన్న చెవులపిల్లులు, పునుగు పిల్లి వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. రంగురంగుల పక్షుల్ని చూసేందుకు బర్డ్​ లవర్స్​ ఇక్కడికి ఎక్కువగా వెళ్తుంటారు. టూరిస్టులు పార్క్​కి దగ్గర్లోనే రెస్టారెంట్లలో నచ్చిన ఫుడ్ తినొచ్చు. 
అంతేకాదు ఇక్కడికి దగ్గర్లోనే ‘వీసా బాలాజీ’గా పేరొందిన ‘చిల్కూర్​ బాలాజీ’ టెంపుల్​ ఉంది. 
 

ఇలా వెళ్లాలి
హైదరాబాద్​ నుంచి 25 కిలోమీటర్లు జర్నీ. బస్సులో లేదంటే బైక్​ మీద, కారులో కూడా వెళ్లొచ్చు. 
ఎంట్రీ ఫీజు: పిల్లలకు రూ.5, పెద్దలకు 30 రూపాయలు. సఫారీ రైడ్​కి వెళ్లాలంటే 50 రూపాయలు.  సఫారీ రైడ్​లో ఒకేసారి 50 మంది వెళ్లొచ్చు. 
టైమింగ్స్​: ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు. వర్షాకాలంలో ఇక్కడికి వెళ్తే పచ్చదనంతో పార్క్​ మొత్తం చూడముచ్చటగా కనిపిస్తుంది. అన్ని రోజులు తెరిచే ఉంటుంది.