
- ఢిల్లీలో ధర రూ.1.12 లక్షలు
- రూ.2,800 పెరిగిన వెండిధర
న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లలో బలమైన డిమాండ్కారణంగా ఢిల్లీలో బంగారం ధర రూ. 5,080 పెరిగి, 10 గ్రాములకు రూ. 1,12,750తో కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర సోమవారం 10 గ్రాములకు రూ. 1,07,670 వద్ద ముగిసింది. 2024 డిసెంబర్ 31న పది గ్రాముల ధర రూ. 78,950తో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు బంగారం ధర 43 శాతం (రూ. 33,800) పెరిగింది.
వెండి ధర కూడా రూ. 2,800 పెరిగి కిలోగ్రాముకు రూ. 1,28,800 రికార్డు గరిష్ఠానికి చేరుకుంది. అంతకుముందు మార్కెట్ సెషన్లో ఇది కిలోకు రూ. 1,26,000 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర ఔన్స్కు (28.3 గ్రాములు) 3,659.27 డాలర్లకు పెరిగి ఆల్-టైమ్ హైని తాకింది. ఆ తర్వాత ఇది 3,652.72 అమెరికన్ డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత వారం యూఎస్లో బలహీనమైన కార్మిక మార్కెట్ గణాంకాల వల్ల ద్రవ్య విధానం సడలింపుకు అవకాశం ఏర్పడింది.
దీంతో పెట్టుబడిదారులు బంగారం లాంటి సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపారు. డాలర్ వెనక్కి తగ్గడం కూడా బులియన్ ధరల పెరుగుదలకు మద్దతు ఇచ్చింది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కు చెందిన సౌమిల్ గాంధీ మాట్లాడుతూ, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సంవత్సరం బంగారం ధర 35 శాతం కంటే ఎక్కువ పెరిగి అనేకసార్లు కొత్త రికార్డు గరిష్టాలను తాకిందని తెలిపారు. సెంట్రల్ బ్యాంకుల నుంచి బలమైన డిమాండ్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి పెట్టుబడుల ప్రవాహం, వడ్డీ రేట్ల తగ్గింపుపై ఊహాగానాలు ఈ రికార్డు స్థాయి ర్యాలీకి కారణమయ్యాయని గాంధీ వివరించారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సుంకాల ప్రభావం కూడా బంగారం ర్యాలీకి దోహదపడ్డాయని చెప్పారు.
రూ.1.5 లక్షలకు వెండి ?
భారత మార్కెట్లో వెండి ధర కిలోగ్రాముకు రూ.1.5 లక్షలకు చేరుకోవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. పారిశ్రామిక డిమాండ్, బలహీనపడిన డాలర్ దీనికి కారణమని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ రేటు 50 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది. దేశీయంగా రానున్న ఆరు నెలల్లో కిలో వెండి ధర రూ.1.35 లక్షలకు, 12 నెలల్లో రూ.1.5 లక్షలకు చేరవచ్చని నివేదిక తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో కోమెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ ప్రారంభంలో 45 డాలర్లు, ఆపై 50 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని వెల్లడించింది.
2025లో పారిశ్రామిక డిమాండ్లో వెండి వాటా 60 శాతం వరకు ఉండొచ్చని యుఎస్ సిల్వర్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. సోలార్, ఎలక్ట్రిక్ వాహనాలు, టెలికం నుంచి వెండికి గిరాకీ పెరిగింది. రిజర్వులను విస్తరించుకోవడంలో భాగంగా రష్యా 535 మిలియన్ డాలర్ల విలువైన వెండిని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంక్ కూడా సిల్వర్-లింక్డ్ ఈటీఎఫ్లలో సుమారు 40 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టింది. 2025 మొదటి ఆర్నెళ్లలో మనదేశం 3,000 టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది.