3 రోజుల్లో 31.5 కిలోల గోల్డ్ సీజ్
విలువ రూ.13.3 కోట్లు
నాలుగు ముఠాల్లోని 13 మంది అరెస్ట్ చేసిన డీఆర్ఐ
సికింద్రాబాద్, నెల్లూరు, విజయవాడ రైల్వేస్టేషన్లలో పట్టివేత
బెజవాడ కనకదుర్గ వారధి బస్టాప్ వద్ద కూడా..
అందరి వెనక వరంగల్ మాస్టర్మైండ్స్
గోల్డ్ స్మగ్లర్లు రూట్ మార్చారు. ఇప్పటిదాకా కొత్త టెక్నిక్లతో విమానాల్లో బంగారం స్మగ్లింగ్ చేసిన కొరియర్లు.. ఇప్పుడు రైళ్లు, బస్సులకు మారారు. అయినా అడ్డంగా దొరికిపోయారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 31.5 కిలోల బంగారాన్ని తరలిస్తూ బుక్కయ్యారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు రైళ్లు, బస్సుల్లో చేసిన తనిఖీల్లో కొరియర్లు పట్టుబడ్డారు. చెన్నై నుంచి విజయవాడ మీదుగా వరంగల్, హైదరాబాద్కు బంగారం తరలిస్తున్న నాలుగు ముఠాలకు చెందిన 13 మంది ఆట కట్టించిన అధికారులు, వారిని అరెస్ట్ చేసి రూ.13.3 కోట్ల విలువైన గోల్డ్ సీజ్ చేశారు. వివరాలను డీఆర్ఐ హైదరాబాద్ జోన్ అడిషనల్ డీజీ ఆదివారం వెల్లడించారు.
స్మగ్లింగ్ కోసం స్పెషల్ బట్టలు
స్మగ్లింగ్ కోసం స్మగ్లర్లు కొత్త కొత్త టెక్నిక్లను ఎంచుకుంటున్నారు. ఆదివారం దొరికిపోయిన కొరియర్లు, స్మగ్లింగ్ కోసం స్పెషల్గా తయారు చేసిన బట్టలు వేసుకున్నారు. వాటిలోనే గోల్డ్ పెట్టి తరలించే ప్రయత్నం చేశారు. బంగారం తరలిస్తున్నారన్న సమాచారంతో ఆదివారం ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకున్న డీఆర్ఐ అధికారులు చెన్నై–హైదరాబాద్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో తనిఖీలు చేశారు. అనుమానంగా కనిపించిన వ్యక్తులను సోదా చేశారు. స్పెషల్గా వేసుకున్న బట్టల్లో బంగారం పెట్టి తీసుకెళుతున్నట్టు గుర్తించారు. రూ.4.53 కోట్లు విలువ చేసే 10.709 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్కు అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు కొరియర్లు, ట్రాన్స్పోర్టర్ల వ్యవస్థతో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు తేల్చారు. ఇక, శుక్రవారం చెన్నై నుంచి బయల్దేరిన జైపూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో నెల్లూరు డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేశారు. ప్రత్యేక ప్యాకెట్లలో పెట్టిన బంగారాన్ని లగేజీ బ్యాగ్లో పెట్టుకుని వరంగల్కు తరలిస్తుండగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. రూ.3.6 కోట్ల విలువైన 7.228 కిలోల గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. శనివారం విజయవాడ రైల్వే స్టేషన్లో జీటీ ఎక్స్ప్రెస్ రైల్లో అక్కడి డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. లో దుస్తుల్లో బంగారం తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. రూ.2.99 కోట్ల విలువైన 7.077 కిలోల గోల్డ్ను సీజ్ చేశారు. గోల్డ్ వరంగల్కు తరలిస్తున్నట్టు తేల్చారు.
బస్సులోనూ..
ఎవరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో బస్సులో గోల్డ్ను తరలించే ప్రయత్నం చేసిన ముఠా ఆట కట్టించారు విజయవాడ డీఆర్ఐ అధికారులు. కనకదుర్గ వారధి బస్స్టాప్ వద్ద నలుగురిని అరెస్ట్ చేశారు. చెన్నై నుంచి కావలికి రైల్లో వచ్చిన నలుగురు, అక్కడి నుంచి ఒంగోలు, గుంటూరు మీదుగా ఆర్టీసీ బస్సుల్లో వరంగల్కు బంగారం తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు.. విజయవాడలో ఆటకట్టించారు. లో దుస్తుల్లో పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్న రూ.2.74 కోట్ల విలువైన గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అన్ని ముఠాల వెనక వరంగల్లోనే మాస్టర్మైండ్స్ ఉన్నట్టు చెప్పారు.