తేనె కోసం వెళ్లారు....బంగారు నాణాల చెంబు దొరికింది...చివరకు..

తేనె కోసం వెళ్లారు....బంగారు నాణాల చెంబు దొరికింది...చివరకు..

నెల్లూరు జిల్లా పొదలకురు మండలం చిట్టెపల్లి లో నలుగురు యువకులు తేనె కోసం గ్రామ సమీపంలోని కొండపై ఉన్న పురాతన అంకమ్మ ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ వారికి ఎంతో విలువైన బంగారు నాణేలుతో కూడిన చెంబు దొరికింది.

 వరుణ్, అజిత్, వెంకటేశ్వర్లు కలిసి తేనె కోసం కొండ మీద వున్న అంకమ్మ ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ రాళ్ల కింద వారికి ఇత్తడి చెంబు కనిపించింది. అయితే రాళ్లను తొలగించి చెంబును బయటకు తీసిన యువకులు దాన్ని పగులకొట్టి చూడగా అందులో బంగారు నాణేలు కనిపించాయి. అయితే నాణేలు చూసి భయపడిన యువకులు గ్రామంలో ఒకరి వద్దకు వెళ్లి చెంబును పూర్తిగా పగులకొట్టి చూడాలని ఇచ్చారు. దాంతో చెంబు ను లోపలికి తీసుకువెళ్లిన వ్యక్తి కాసేపు ఆగి బైటికి వచ్చి చెంబులో ఏమి లేవని చెంబు బయట పడేయాలని చెప్పాడు.అయితే అప్పటికే చెంబులో దొరికిన నాణేలను ఫోటో తీసిన యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీ ని కలిశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారించగా వంద గ్రాముల నాణేలను రికవరీ చేసినట్లు తెలిసింది.

అయితే చెంబులో దొరికిన నాణేలు మూడు కేజీలకు పైగా వుంటాయని కోట్ల రూపాయలు విలువ చేస్తాయని స్థానికులు అంటున్నారు. జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే కోట్ల రూపాయల విలువైన నాణేలు బయటకు వస్తాయని అంటున్నారు స్థానికులు. అయితే దొరికిన బంగారు నాణేలు ఏ శతాబ్ధానికి చెందినవో తెలియదు. కానీ, వాటిపై తాజ్ మహల్ పదాలు వచ్చేలా ఉర్దూ లో ఉన్నాయని చెప్పారు. యువకులకు బంగారు నాణేలు దొరికాయి. కానీ, వాటాల్లో తేడాతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నెల్లూరు జిల్లా లో ఎక్కడ ఏ ఇద్దరు చేరినా ఈ బంగారు నాణేల చెంబు గురించే మాట్లాడుకుంటున్నారు.