రేవల్లి/ఏదుల, వెలుగు: గొల్లపల్లి--చీర్కపల్లి ప్రాజెక్టు ప్రతిపాదనకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసన దీక్ష గురువారం నాటికి అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో 10వ రోజుకు చేరుకుంది. వనపర్తి ఎమ్మెల్యే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 1372 ఎకరాల సారవంతమైన భూమి నీట మునిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూ సేకరణ వల్ల వందలాది కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందని, తమ జీవితాలు భవిష్యత్తులో అంధకారమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పది రోజులుగా ఎండను సైతం లెక్కచేయకుండా రైతులు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు వెల్లువలా పెరుగుతోంది. గొల్లపల్లి, చీర్కపల్లి గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు తరలివచ్చి నిరసనలో భాగస్వామ్యమవుతున్నారు. దీంతో ఈ ఉద్యమం మరింత ఉధృత రూపం దాల్చుతోంది. ఈ ధర్నాలో రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
