మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. అందుబాటులోకి సువర్ణ ఆఫర్

మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. అందుబాటులోకి సువర్ణ ఆఫర్

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. పండుగల సీజన్ సందర్భంగా తన ప్యాసింజర్లకు 'మెట్రో సువర్ణ ఆఫర్‌ 2021' పేరుతో కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌ కింద 20 ట్రిప్‌లకు చార్జీలు చెల్లిస్తే 30 ట్రిప్పులు ప్రయాణించే అవకాశం కల్పిస్తారు. అంటే 20 ట్రిప్‌లకు పది ట్రిప్‌లు ఫ్రీ అన్నమాట. పైగా ఈ 30 ట్రిప్‌లను మీరు 45 రోజుల్లో ఎపుడైనా వాడుకోవచ్చు. పైగా ఆఫర్‌ కాలంలో గరిష్ఠంగా రూ. 15 చెల్లించి గ్రీన్‌ లైన్‌లో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు. గ్రీన్‌లైన్‌ అంటే ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ మధ్య స్టేషన్లు. అంతేకాదు ఒక నెలలో 20 మెట్రో ట్రిప్‌లు ప్రయాణించిన ప్యాసింజర్ల కోసం ప్రతినెలా లక్కీ డ్రా కూడా ఉంటుందని మెట్రో పేర్కొంది.
హైదరాబాద్ నగరంలో పలు చోట్ల రోడ్ల నెమ్మదిగా సాగుతున్న మరమ్మత్తులు, నత్తనడకన సాగుతున్న ఫ్లై ఓవర్ల నిర్మాణాల కారణంగా.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆఫీసులు ప్రారంభించే లేదా ముగిసే సమయాల్లో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. పండుగల పూట ఊర్లకు వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడు రద్దీ మరింతగా ఉంటోంది. ఈ నేపధ్యంలో సౌకర్యవంతంగా.. వేగంగా ప్రయాణించే అవకాశం ఉన్న మెట్రో.. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఈ ప్రత్యేక ఆఫర్ ను మరోసారి అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్‌ ఈనెల 18 నుంచి జనవరి 15వ తేదీ వరకు అమల్లోకి ఉంటుంది. అయితే పాత, కొత్త మెట్రో స్మార్ట్‌ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ ఆఫర్‌ అందిస్తారు.