
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) వడ్డీని 96.51 శాతం మంది సభ్యుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటించింది. ఈ ఏడాది వడ్డీ జమ వేగవంతంగా జరగడం విశేషం. సాధారణంగా, పీఎఫ్ వడ్డీ జమ కావడానికి నెలలు పడుతుంటుంది.
ఈసారి ఆర్థిక మంత్రిత్వ శాఖ వడ్డీ రేటును నోటిఫై చేసిన రెండు నెలల్లోపే దాదాపు అన్ని ఖాతాలకు వడ్డీ జమ అయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 13.88 లక్షల సంస్థలకు చెందిన 33.56 కోట్ల మంది సభ్యుల ఖాతాలను అప్డేట్ చేయాల్సి ఉంది.
ఈ ఏడాది జులై 8 నాటికి, 13.86 లక్షల సంస్థలకు చెందిన 32.39 కోట్ల మంది సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ అయింది. దాదాపు 99.9శాతం సంస్థలకు, 96.51శాతం సభ్యుల ఖాతాల్లో డబ్బులు వేశారు. ఈపీఎఫ్ఓ ఈసారి 8.25 శాతం వడ్డీని చెల్లించింది.