న్యూఢిల్లీ: మ్యూచువల్ఫండ్స్, స్టాక్ పెట్టుబడులు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అందుకే 2025 ఆర్థిక సంవత్సరంలో భారతీయ కుటుంబాల సంపద భారీగా పెరిగింది. దీని విలువ రూ.13 లక్షల కోట్ల నుంచి రూ.14 లక్షల కోట్ల వరకు ఉంది. బెయిన్ అండ్ కంపెనీ రిపోర్ట్ప్రకారం.. గత ఐదేళ్లలో వీళ్ల సంపద విలువ 13 శాతం పెరిగింది. రిటైల్ పెట్టుబడుల తీరులోనూ మార్పులు వచ్చాయి. డిపాజిట్ల కంటే మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్), లిస్టెడ్ ఈక్విటీ ఆస్తులు వేగంగా పెరిగాయి. అయితే ఎంఎఫ్, ఈక్విటీ కేటాయింపుల్లో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఇంకా వెనుకబడే ఉంది.
అమెరికాలో ఇది 50 నుంచి 60 శాతం, బ్రెజిల్లో 40 నుంచి 45 శాతం దాకా ఉంది. మన దగ్గర 20 శాతం మాత్రమే ఉంది. 2025 చివరి నాటికి వ్యక్తుల మ్యూచువల్ ఫండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ విలువ రూ.41 లక్షల కోట్లకు చేరింది. గత ఐదేళ్లలో కుటుంబాల పెట్టుబడులు ఆరు శాతం నుంచి 11 శాతానికి పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఈక్విటీ ఆధారిత ఫండ్స్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్) పట్ల పెరుగుతున్న నమ్మకం, ఆర్థిక అక్షరాస్యత పెరగడం ఈ వృద్ధికి కీలకంగా మారాయి. నేరుగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరగడంతో 2025 చివరి నాటికి వ్యక్తిగత, డైరెక్ట్ ఈక్విటీ హోల్డింగ్స్ రూ.42 లక్షల కోట్లకు చేరాయి.
2025లో పెట్టుబడుల తీరును మార్చిన 5 మెగా ట్రెండ్స్ ఇవే..
- ఎన్ఎస్ఈలో రిజిస్టర్ అయిన 30 ఏళ్లలోపు ఇన్వెస్టర్ల వాటా 2020 ఆర్థిక సంవత్సరంలో 25 శాతం నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 40 శాతానికి పెరిగింది.
- గ్రో, జీరోధా, అప్స్టాక్స్ వంటి యాప్ ఆధారిత ప్లాట్ఫామ్లు పెట్టుబడిని కాగిత రహితంగా, సులభంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చాయి. మొత్తం రిటైల్ ఈక్విటీ ఇన్వెస్టర్లలో దాదాపు 80 శాతం మందికి ఈ ప్లాట్ఫామ్లు సేవలను అందిస్తున్నాయి.
- ఎంఎఫ్లలో పెట్టుబడుల రూల్స్సరళంగా మారడం, స్కీమ్ హేతుబద్ధీకరణ, ఒకేరకమైన వ్యయ పరిమితి ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచాయి.
- యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫిన్టెక్ యాప్ల వంటి వాటిలో ప్రాంతీయ, డిజిటల్ ఆర్థిక కంటెంట్ పెరగడం వల్ల పెట్టుబడి విధానాలు మరింత సులభంగా అర్థమవుతున్నాయి.
- నిఫ్టీ, సెన్సెక్స్ గత పదేళ్లలో 10 నుంచి 15 శాతం రాబడులను అందించింది.
- గత ఐదేళ్లలో సంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మ్యూచువల్ ఫండ్స్, ముఖ్యంగా ఈక్విటీ ఆధారిత పథకాలు భారీ రాబడులను అందించాయి.
