విష్ణుపురం వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్

విష్ణుపురం వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్
  • మిర్యాలగూడ స్టేషన్ లో ఐదు గంటలకుపైగా నిలిచిపోయిన శబరి ఎక్స్ ప్రెస్ 
  • పిడుగురాళ్ల వద్ద జన్మభూమి ఎక్స్​ప్రెస్​ నిలిపివేత

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా దామరచర్ల పరిధిలోని విష్ణుపురం రైల్వే స్టేషన్ సమీపంలో లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్ క్రాస్​ చేస్తున్న గూడ్స్ ట్రెన్ 4,5 నంబర్ బోగీలు ఆదివారం పట్టాలు తప్పాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ప్యాసింజర్ రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. సికింద్రాబాద్ నుంచి కేరళకు బయల్దేరిన శబరి ఎక్స్ ప్రెస్ ను మిర్యాలగూడ రైల్వే స్టేషన్​లో, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్​ వెళ్తున్న  జన్మభూమి రైలును పిడుగురాళ్ల వద్ద ఆపేశారు.

 విష్ణుపురం చేరుకున్న రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన రైల్వే లైన్​కు రిపేర్లు చేపట్టారు. మధ్యాహ్నం 2  గంటల సమయంలో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పగా, రాత్రి 7 గంటల వరకు మరమ్మతులు చేసి శబరి ఎక్స్ ప్రెస్​ను పంపించారు. 

స్నాక్స్, వాటర్ బాటిల్స్ అందజేసిన ఎమ్మెల్యే  

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో శబరి ఎక్స్ ప్రెస్ ను నిలిపివేయడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అక్కడకు చేరుకుని బీఎల్ఆర్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి సుమారు 4 వేల మందికి వాటర్ బాటిల్స్, స్నాక్స్ అందజేశారు.