హైదరాబాద్ : గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కోఠి మహిళా విశ్వవిద్యాలయం వీసీ విజ్జులత.. ఫిర్యాదు చేయడంతో గడ్డం శ్రీనివాస్ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను దుర్భాషలాడారని సుల్తాన్ బజార్ పోలీసుకు విజ్జులత ఫిర్యాదు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
జులై 1వ తేదీన తనకు తాను సోషల్ వర్కర్ నంటూ.. బాలికలకు ఉచిత విద్య, స్కాలర్ షిప్ లను అందిస్తున్నట్లు వీసీ విజ్జులతకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తనకు సన్మానం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు హుకుం జారీ చేశాడు. అయితే.. మహిళా విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఆర్థికంగా సహకారం అందించాలని వీసీ విజ్జులత కోరారు. దీంతో తాను గోషామహల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థినంటూ వీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘నువ్వు ఏమైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారిని అనుకుంటున్నవా..? వీసీ అయ్యాక నీ కళ్లు నెత్తికెక్కాయి’’ అంటూ వీసీపై దుర్భాషలాడాడు శ్రీనివాస్ యాదవ్. దీంతో గడ్డం శ్రీనివాస్ యాదవ్ పై వీసీ విజ్జులత.. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం పోలీసులు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చారు.
