హైదరాబాద్, వెలుగు: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన భార్య ఉషాబాయి హైకోర్టును ఆశ్రయించారు. లా అండ్ ఆర్డర్ వింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్, చర్లపల్లి జైల్ సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా చేశారు. గత నెల 25న పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడాన్ని ఆమె సవాల్ చేశారు. ఆర్టికల్ 14, 21లకు వ్యతిరేకంగా ఆగస్టు 26 నుంచి రాజాసింగ్ను అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు.
లా అండ్ ఆర్డర్కు భంగం కలిగిస్తున్నారని చెప్పి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడానికి వీలుగా గత నెల 26న జీవో 1651ను జారీ చేశారని చెప్పారు. రాజాసింగ్పై 3 కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారని, అందులో రెచ్చగొట్టే ప్రకటనలు చేశారనే కేసులో కోర్టు రిమాండ్కు తరలించేందుకు అనుమతించలేదని గుర్తు చేశారు. మరో రెండు కేసులకు సంబంధించి పోలీసులు నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. ఆ కేసుల గురించి చెప్పకుండా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు.