హైదరాబాద్, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదని, వాటిని వెంటనే బాగు చేయాలని నీటిపారుదల శాఖను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) కోరింది. కెమెరాలు పనిచేయకపోవడం వల్ల ప్రాజెక్టు వద్ద ఏం జరుగుతున్నదో తెలియడం లేదని బుధవారం కరీంనగర్ఈఎన్సీకి రాసిన లేఖలో జీఆర్ఎంబీ మెంబర్సెక్రటరీ రంగసామి అళగేశన్ పేర్కొన్నారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు ప్రాజెక్టు అధికారులతో జీఆర్ఎంబీ సమావేశమై ప్రాజెక్ట్ సైట్ వద్ద 7 సీసీటీవీలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టు వద్ద ఏం జరుగుతున్నదో జీఆర్ఎంబీ ఆఫీసుకు సీసీటీవీల నుంచి ట్రాన్స్మిటర్ ద్వారా తెలిసేదన్నారు. కానీ, ప్రాజెక్ట్ సైట్ను సందర్శించిన సందర్భాల్లో కొన్ని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.
సీసీటీవీల నుంచి డేటాను పంపించేందుకు ఉపయోగపడే జీఎస్ఎం నెట్వర్క్లు ఎక్స్పైరీ అవడం వల్ల కొన్ని నెలలుగాఎలాంటి సమాచారమూ రావడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా వాటిని బాగు చేయలేదన్నారు. జులై 4న ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటీ తీర్పు ఉన్నందున.. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని, వెంటనే వాటిని బాగు చేయాలని లేఖలో కోరారు.