సౌదీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‏గ్రేషియా

సౌదీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‏గ్రేషియా

హైదరాబాద్: సౌదీ అరేబియా బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‏గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం (నవంబర్ 17) జరిగిన భేటీలో కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సౌదీ ఆరేబియాలో మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైన దుర్ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఈ ఘటనపై కేబినెట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. 

మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీ అరేబియాకు పంపించాలని మంత్రి మండలి నిర్ణయించింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు మృతదేహాలకు మత సంప్రదాయాల ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని, అందుకోసం బాధిత కుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరిని సౌదీ అరేబియా తీసుకెళ్లడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

కాగా, సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సోమవారం ( నవంబర్ 17 ) తెల్లవారుజామున ఉమ్రా యాత్రకు వెళ్లిన యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‎ను ఢీకొనడంతో 45 మంది సజీవ దహనమమయ్యారు. ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో మృతులంతా హైదరాబాద్‎కు చెందినవారే. ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే రాష్ట్ర సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సౌదీలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడింది.